మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పేలుడు, దంపతులు మృత్యువాత
కడప: మాజీ శాసన సభ్యుడి నివాసంలో పేలుడు కారణంగా దంపతులు మృతి చెందారు. కడప జిల్లా రాజంపేట మాజీ శాసన సభ్యుడు కసిరెడ్డి మదన్మోహన్ రెడ్డి ఇంట్లో శనివారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి గోడ కూలిపోవడంతో ఓ గది లో నిద్రిస్తున్న భార్యాభర్తలు మృతి చెందారు.
మదన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో నివాసం ఉంటూ రాజంపేటకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన భార్యాభర్తలు పోతిరెడ్డి (65), లక్ష్మమ్మ (60) గత ఇరవై ఏళ్లు గా ఆయన ఇంట్లో పని చేస్తున్నారు. పేలుడు ధాటికి గోడ కూలి మీదపడటంతో వీరిద్దరూ చనిపోయారు.
పేలుడు సంభవించిన సమయంలో మదన్మోహన్ రెడ్డి ఇంట్లో లేరని చెబుతున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. గదిలో గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు వచ్చి విస్ఫోటం సంభవించినట్టుగా ఫోరెన్సిక్ విభాగం అధికారులు చెబుతున్నారు.
ఇంట్లోని రెండు గ్యాస్ సిలిండర్లలో ఒక దాని నుంచి గ్యాస్ లీకవుతున్న విషయాన్ని గుర్తించారని సమాచారం. గ్యాస్ లీకై గది మొత్తం వ్యాపించిందని, ఆ సమయంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయి మళ్లీ వచ్చిన సందర్భంలో పేలుడు సంభవించినట్టుగా భావిస్తున్నారు. పోలీసులు విచారిస్తున్నారు.