రోడ్డుపై మొండెం లేని తల: తీవ్ర భయాందోళనలో యలమంచిలి వాసులు
అమరావతి: విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలి వాసులు శనివారం ఉదయం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. యలమంచిలి పట్టణంలోని అల్లూరి సీతారామరాజు కాలనీ ప్రధాన రహదారిపై మొండెం లేని తల కలకలం సృష్టించింది.
దీంతో స్థానికులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులకు కొద్ది సేపట్లోనే యలమంచిలి రైల్వే గేటు సమీపంలో తల లేని మొండెం పడి ఉందన్న సమాచారాన్ని ఇచ్చారు.
రెండు ప్రాంతాలకు వెళ్లిన పోలీసులు రోడ్డుపై పడ్డ తల, రైల్వే గేటు వద్ద పడి ఉన్న మొండేనికి చెందినదై ఉంటుందని దాదాపుగా తేల్చేశారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తిని ఎవరో హత్యచేసి తల, మొండెంను వేరు చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చెరువులో పడి వ్యక్తి మృతి
ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన విజయనగరం జిల్లా రాజాంలో చోటు చేసుకుంది. సాలూరుకు చెందిన బోనెల రామస్వామి(55) రాజాం మారుతీనగర్లో ఉంటున్న తన కొడుకు వద్దకు వచ్చాడు.
శనివారం తెల్లవారుజామున మారుతీ నగర్ కాలనీకి సమీపంలో ఉన్న కొత్త చెరువు వద్దకు వెళ్లిన రామస్వామి ప్రమాదవశాత్తు అందులో జారిపడి మృతి చెందాడు. దీనిని గమనించిన స్థానికులు మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications