రాత్రి గడ్డి కోసేందుకొచ్చారా: బొజ్జల, 'తమిళనాడుతో బాగానే ఉంది'
హైదరాబాద్: తమిళనాడు నుండి శేషాచలానికి రాత్రిపూట గడ్డి కోసుకోవాడానికేం రాలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి బుధవారం ఘాటుగా స్పందించారు. శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పైన విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బొజ్జల స్పందించారు.
మృతి చెందిన వారిలో తమిళనాడుకు చెందిన మృతదేహాలను తరలించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. చనిపోయింది ఎర్రచందనం దొంగలే అన్నారు. వారు తమిళనాడు నుండి గడ్డి కోసుకునేందుకు రాలేదన్నారు.
పాత్రదారులు, సూత్రధారులు... ఎవరు ఏమిటనేది విచారణలో తేలుతుందన్నారు. ఏ పార్టీ వారైనా, ఎంత పెద్ద నేతలైనా తాము ఎర్రచందనం దొంగలను వదిలే ప్రసక్తే లేదన్నారు.
కొన్నేళ్లుగా ఎర్ర చందనం అక్రమ రవాణా సాగుతోందన్నారు. స్మగ్లింగ్ అడ్డుకునే క్రమంలోనే ఎన్కౌంటర్ జరిగిందన్నారు. ఎవరు ఏమిటనేది విచారణలో తప్పకుండా తేలుతుందన్నారు. వందల సంఖ్యలో ఎర్ర చందనం కొల్లగొట్టిన మాట వాస్తవమని చెప్పారు.
ఎర్రచందనం స్మగ్లర్లను ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు. శేషాచలం అడవుల్లో మరణించింది కూలీలు కాదని, వారంతా ఎర్రచందనం స్మగ్లర్లే అన్నారు.
రాత్రిపూట అడవుల్లో గడ్డి కోయడానికి వచ్చారా? అని మంత్రి ప్రశ్నించారు. ఎర్రచందనం స్మగ్లర్లపై నిరంతరం దాడులు కొనసాగిస్తామని మంత్రి చెప్పారు. స్మగ్లర్లతో సంబంధాలున్న రాజకీయ నాయకులను వదిలి పెట్టేది లేదన్నారు. స్మగ్లర్ల సెల్ఫోన్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు లేవు: చినరాజప్ప
ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు లేవని దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని చిన రాజప్ప చెప్పారు. శేషాచలం అడవుల్లో ఎన్కౌంటర్ తర్వాతే మృతులు తమిళనాడు వాసులని తెలిసిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.