కౌన్సిలర్గా కూడా గెలవవు!: సోము వీర్రాజు, బీజేపీపై బోండా సంచలన వ్యాఖ్యలు
విజయవాడ: తెలుగుదేశం ప్రభుత్వం గత కొంత కాలంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న భారతీయ జనతా పార్టీ నేత సోము వీర్రాజుపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీలో బీజేపీ ఎదుగుతుందనుకోవడం అత్యాశేనని ఉమ ఎద్దేవాచేశారు.
Recommended Video

ఏపీకి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్యాకేజీలో ఒక్క రూపాయి కూడా రాలేదని ఆరోపించారు. వెనుకబడిన జిల్లాలకు రూ.24 వేల కోట్లకు గాను... 1,050 కోట్లు ఇచ్చారని చెప్పారు.

వీర్రాజువి శుద్ధ అబధ్దాలు
ఏపీకి కేంద్రం సాయంపై సోము వీర్రాజు వ్యాఖ్యలు శుద్ధ అబద్ధమని, అంతేకాకుండా ఏపీలో బీజేపీ ఒంటరిగా ఎప్పుడు ఎదగలేదని బోండా ఉమ తేల్చి చెప్పారు. భవిష్యత్లో బీజేపీ ఎదుగుతుందని అనుకోవడం వాళ్ల అత్యాశేనని బోండా ఉమా వ్యాఖ్యానించారు.

కౌన్సిలర్గా కూడా గెలవవు!
సోము వీర్రాజు ఒంటరిగా రాజమండ్రిలో పోటీ చేస్తే కౌన్సిలర్గా కూడా గెలవలేరని బోండా ఉమ ఎద్దేవా చేశారు. 2009 ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేస్తే 15 లక్షల ఓట్లకు కేవలం 7వేల ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు.

ఒక్క రూపాయి వచ్చిందా?
ఏపీకి అన్ని ఇచ్చాం, ఇన్ని ఇచ్చామని చెబుతున్నారని, 2016లో అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్యాకేజీలో ఒక్క రూపాయి అన్న రాష్ట్రానికి వచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. వెనుకబడిని జిల్లాలకు బుదేల్ ఖండ్, కలహాండి ప్యాకేజీ తరహాలో ఇస్తామన్నారని అవన్నీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. రూ.24వేల కోట్లకుగానూ కేంద్రం కేవలం రూ.1,050 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు.

రాజధాని నిర్మాణం ఎలా సాధ్యం?
రాష్ట్ర రాజధానికి రైతులు రూ.50వేల కోట్లు విలువ చేసే భూమి ఇస్తే బీజేపీ రూ.1500కోట్లు ఇచ్చిందని బోండా ఉమా అన్నారు. వాటితో ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. వ్యక్తిగత ఎజెండాతోనే సోము వీర్రాజు పని చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ తమను మోసం చేసిందని ఏపీ ప్రజలు భావిస్తున్నారని, ఇందుకు సోము వీర్రాజు సమాధానం చెప్పాలని ఉమ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications