జగన్తో పవన్ చేతులు కలపడు!, పదవి ఆశించడం నిజమే, కానీ..: బోండా ఉమా
వైసీపీ ఎంపీలను అభినందించినంత మాత్రాన పవన్ జగన్ తో చేతులు కలుపుతారని తాను భావించడం లేదని బోండా ఉమా అన్నారు.
చిత్తూరు: ఓవైపు ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ ఎంపీలను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభినందించడం, మరోవైపు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పార్టీపై ధిక్కారం వినిపిస్తుండటం.. టీడీపీని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా పవన్ వ్యాఖ్యలపై స్పందించారు.
వైసీపీ ఎంపీలను అభినందించినంత మాత్రాన పవన్ జగన్ తో చేతులు కలుపుతారని తాను భావించడం లేదని బోండా ఉమా అన్నారు. తాను దొంగలతో కలిసే ప్రసక్తే లేదని పవన్ గతంలోనే స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు.
ఇక కాపులకు సీఎం చంద్రబాబు అన్యాయం చేస్తున్నారన్న ఆరోపణలను బోండా ఉమా తప్పుపట్టారు. చంద్రబాబు గనుక కాపుల గొంతు నొక్కేస్తున్నారని తాను అన్నట్లుగా గనుక నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్దంగా ఉన్నానని సవాల్ విసిరారు. పార్టీ కోసం 14ఏళ్లుగా కష్టపడుతున్న నేతగా మంత్రిపదవి కోరుకోవడం నిజమేనని, అయితే భవిష్యత్తులో తనకూ అవకాశం లభిస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. తమ నాయకుడు చెప్పిందే తమకు శాసనమని తెలిపారు.
ఇక లగడపాటి టీడీపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను బోండా ఉమా కొట్టిపారేశారు. లగడపాటి రాజకీయాలనుంచి తప్పుకున్నట్లు ఆనాడే ప్రకటించారని, టీడీపలో ఆయన చేరిక కేవలం ఊహాగానమేనని చెప్పారు.