చిరంజీవిపై బోండా ఎదురుదాడి: సాక్షి బ్యాన్పై శైలజానాథ్ వ్యాఖ్య
విజయవాడ/ హైదరాబాద్: కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవిపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు ఎదురుదాడికి దిగారు. కాపుల కోసం పార్టీ పెట్టిన చిరంజీవి ఇప్పటివరకు కాపు సమస్యలపై ఎప్పుడైనా మాట్లాడారాఆయన అడిగారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, ముద్రగడ తోడుదొంగల్లా ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రశాంతతకు భంగం కలిగించేవారిని ప్రోత్సహించకూడదని ఆయన అన్నారు. కాపుల సమస్యలపై మాట్లాడే హక్కు కాంగ్రెస్, వైసీపీకి లేదని బోండా ఉమా అన్నారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్కు చెందిన సాక్షి టీవీ చానెల్ ప్రసారాలను నిలిపేయడంపై కాంగ్రెసు నాయకుడు శైలజానాథ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యూస్ చానెళ్లను నియంత్రించడం సరి కాదని అన్నారు.

తుని ఘటనను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం కాపు సామాజిక వర్గాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోందని ఆయన శనివారం మీడియాతో అన్నారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని ఆయన సూచించారు. ముద్రగడ అంగీకరిస్తే తుని ఘటనపై సిబిఐ విచారణ జరిపిస్తామని మంత్రి నారాయణ చెప్పడం బ్లాక్ మెయిల్ చేయడమేనని ఆయన అన్నారు.
మంత్రి నారాయణ కార్పోరేట్ కాలేజీల సీట్ల వ్యవహారంపై విచారణకు సిద్ధమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రైవేట్ కాలేజీలు వసూలు చేస్తున్న ఫీజులకు ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు తేడాలున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications