ఆయన టిడిపిలో చేరుతారు చూడండి: ఉమ, నవ్వుకున్న కోటంరెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావుల మధ్య ఏపీ నూతన అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావుల మధ్య ఏపీ నూతన అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది.
టిడిపిలోకి కోటంరెడ్డి అని..
ఇప్పటికే ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు వైసిపి నుంచి టిడిపిలో చేరారు. దీనిని ఉద్దేశించి బోండా ఉమ మాట్లాడారు. త్వరలో కోటంరెడ్డి కూడా మా పార్టీ కండువా వేసుకుంటారని, అందులో అనుమానం లేదని, చూస్తుండండని అన్నారు. బోండా ఉమకు కాగితపు వెంకట్రావు కూడా జత కలిశారు.
కాలమే నిర్ణయిస్తుందని..
సోమవారం టిడిపి ఎమ్మెల్యేలు విలేకరులతో మాట్లాడి బయటకు వెళ్తున్న సమయంలో కోటంరెడ్డి ఎదురుపడ్డారు. అప్పుడు బోండా ఉమ అన్నారు. దానిపై కోటంరెడ్డి స్పందిస్తూ.. ఎవరే పార్టీలో చేరుతారో కాలమే నిర్ణయిస్తుందన్నారు.
మంచినీళ్లు కూడా లేవు
మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు పార్టీ అధ్యక్షులు కళావెంకట్రావుతో కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి నారా లోకేశ్ వచ్చి తిరిగే వెళ్లే సందర్భంలో ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. ఇక్కడ మంచినీళ్లు కూడా లేవని, మీరైనా ఆలోచించాలని మీడియా ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
మాకు కూడా లేవు..
దానికి నారా లోకేష్ స్పందిస్తూ.. మీకే కాదు, లోపల మాకూ లేవని, ఏం చేస్తాం? ప్రారంభం కదా.. ఇలాగే ఉంటుందని, ఒకట్రెండు రోజుల్లో సర్దుకుపోతాయని, ముఖ్యమంత్రితో మాట్లాడి మీకు తగు ఏర్పాట్లు చేస్తామని లోకేష్ చెప్పారు. అంతకుముందు లోకేశ్ విలేకరుల సమావేశంలోనూ ఆచితూచి స్పందించారు. వివాదాస్పద అంశాలపై మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.