మోడీతో జగన్ భేటీ, బాబులో ఉలిక్కిపాటు, ఎవడికో కడుపు మండి: బొత్స
ప్రధాని నరేంద్ర మోడీని వైసిపి అధినేత జగన్ గోప్యంగా ఎందుకు కలిశారని, విషయాలు ఎందుకు బయట పెట్టడం లేదన్న సీఎం చంద్రబాబు, టిడిపి నేతలకు వైసిపి నేత బొత్స సత్యనారాయణ ఆదివారం కౌంటర్ ఇచ్చారు.
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీని వైసిపి అధినేత జగన్ గోప్యంగా ఎందుకు కలిశారని, విషయాలు ఎందుకు బయట పెట్టడం లేదన్న సీఎం చంద్రబాబు, టిడిపి నేతలకు వైసిపి నేత బొత్స సత్యనారాయణ ఆదివారం కౌంటర్ ఇచ్చారు.
జగన్ చాలా రోజులుగా ప్రధాని మోడీని కలిసేందుకు ప్రయత్నించగా, ఇప్పుడు అపాయింటుమెంట్ దొరికిందన్నారు. టిడిపి నేతలు తమ డొల్లతనం, అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు అసలు ఏం కావాలో తెలియడం లేదన్నారు. తాము ఏ విషయాన్ని దాచి పెట్టడం లేదన్నారు. చంద్రబాబు తన వ్యాపారాలు చక్కబెట్టుకోవడం తప్ప రాష్ట్రానికి పెట్టుబడులు మాత్రం తేవడం లేదని విమర్శించారు.

మోడీతో జగన్ భేటీ.. చంద్రబాబులో ఆందోళన
మోడీతో జగన్ భేటీ అవడంతో చంద్రబాబు అభద్రతకు లోనవుతున్నారన్నారు. అసలు ఒక ప్రతిపక్ష నేత ప్రధానితో భేటీ అయితే తప్పేమిటని ప్రశ్నించారు. ఇందులో గోప్యత పాటించడానికి ఏముందని ప్రశ్నించారు.
ఆ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయో భేటీ అనంతరం జగన్ మాట్లాడిన ప్రెస్మీట్ చూస్తే తెలిసిపోతుందన్నారు. పీఆర్వో ఇచ్చే సమాచారం ద్వారా కూడా చంద్రబాబుకు ఆ వివరాలు తెలుసుకునే అవకాశముందన్నారు.

అవినీతి బయటపడుతుందని బాబు ఉలిక్కిపాటు
తన అవినీతి బండారం ఎక్కడ బయటపడుతుందో అని చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయడం మానేస్తే జగన్ ఆ పని చేయాల్సి వస్తుందన్నారు.
రైతులకు నష్టం వస్తే ఆ విషయాన్ని ప్రభుత్వం బాధ్యతగా కేంద్రానికి తెలియజేయాల్సిందిపోయి నిర్లక్ష్యం చేయడంతో ఆ బాధ్యతను జగన్ తన భుజాలకెత్తుకొని ప్రధాని మోడీకి తెలిపారన్నారు. ప్రత్యేక హోదా గురించి అడిగారన్నారు.

చంద్రబాబు ఉద్దేశ్యం ఏమిటి
చంద్రబాబు ప్రజలకు పనికొచ్చే పనులు మాత్రం చేయరుగానీ, తమకు లాభం వస్తుందనుకునే పని మాత్రమే చేస్తారన్నారు. ప్రధానిని కలవడం రహస్యమేమిటని ప్రశ్నించిన ఆయన ఈ చర్యతో మోడీపై చంద్రబాబుకు ఉన్న ఉద్దేశం ఏమిటో తెలుస్తోందన్నారు.
అసలు ప్రధానిని జగన్ కలిస్తే చంద్రబాబుకు ఎందుకు అంత భయమని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అడిగితే ప్యాకేజీ అన్నారని, దానికి చట్టబద్ధత విషయంలో కూడా స్పష్టత లేకుండా పోయిందన్నారు.

రాష్ట్రపతి ఎన్నికలకు ఏన్డీయేకు మద్దతుకు తేడా ఉంది
రాష్ట్రపతి ఎన్నికలకు, ఎన్డీయేకు మద్దతుకు చాలా తేడా ఉందన్నారు. అసలు చంద్రబాబు నీతిమంతుడా అని ప్రశ్నించారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగిన చందంగా ఉంది ఆయన తీరు ఉందన్నారు.
బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్నప్పుడు ప్రజా ఆమోదం ఉన్న పనులే చేయాలని, దొంగతనాలు, అత్యాచారాలు, దోపిడీలు జరిగితే బాధ్యత ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు నిందలు వేస్తారా అని నిలదీశారు.

ఎవడో కడుపు మండి..
రాష్ట్రంలోని వలసల రాజకీయాన్ని దేశంలోన్ని అన్ని పార్టీలకు తెలిపామన్నారు. వైసిపి ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి టిడిపిలో చేర్చుకుంటున్నారని చెప్పారు. హోదా విషయంలో రాజీ పడేది లేదని చెప్పారు. కడుపు మండిన వాడు ఎవడో చంద్రబాబు అమెరికా పర్యటన సందర్భంగా ఈ మెయిల్ పెడితే తమకు ఆపాదించడం ఏమిటన్నారు.












Click it and Unblock the Notifications