దేవుడి విషయంలో వ్యంగ్యం పనికిరాదండి..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..పై శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ఘాటు విమర్శలు సంధించారు. తిరుపతి, సింహాచలం దుర్ఘటనలపై కౌన్సిల్ లో అడిగిన ప్రశ్నలకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇచ్చిన సమాధానం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలపై బాధ్యతారాహిత్యంగా బదులిచ్చారని ఆరోపించారు.
తిరుపతి, సింహాచలం దుర్ఘటనలపై ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతారాహిత్య సమాధానాలను ఇవ్వడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు శాసనమండలి నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప ఏమీ పట్టవా? అని నిలదీశారు. తమకు కావాల్సింది రాజకీయ లబ్ధి కాదని, ప్రజలకు మంచి జరగడమేనని బొత్స సత్యనారాయణ అన్నారు.

చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ప్రజలు.. దేవుడు అంటే లెక్కలేదని, ఎంతసేపూ కుర్చీ కోసమే ఆరాటం తప్ప ప్రజల సమస్యలు పట్టడం లేదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. టీడీపీ కూటమి మంత్రులు, నాయకులు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. శాసన మండలిలో ప్రజల సమస్యలపై తాము అడిగిన ఏ ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పలేక తడబడ్డారని అన్నారు.
తిరుపతి తొక్కిసలాట, సింహాచలంలో గోడ కూలి భక్తుల మరణంపై ప్రభుత్వం, మంత్రుల నుంచి బాధ్యతారాహిత్యంగా సమాధానం వస్తోందని, ప్రజల సమస్యలపై కనీసం బాధ్యతగా వ్యవహరించట్లేదని బొత్స మండిపడ్డారు. నిస్సిగ్గుగా సమాధానాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 50 ఏళ్లకే పెన్షన్ గురించి అడిగితే ఒక్క సమాధానం లేదని పేర్కొన్నారు. తిరుపతి, సింహాచలం ఘటనలు ప్రభుత్వనిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
కల్తీ మద్యంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వట్లేదని, రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతున్నా కనీసం ప్రభుత్వంలో చలనం లేదని బొత్స చెప్పారు. ఈ ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారని అడిగితే డొంకతిరుగుడు సమాధానం ఇస్తున్నారని, బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శకు వెళ్లడాన్ని కూడా తప్పుపడుతున్నారని ధ్వజమెత్తారు. ఎంతో హుందాగా తాము ప్రశ్నలు అడిగామని, మంత్రి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని అన్నారు.
తిరుపతి,సింహాచలం ఘటనలతో ప్రభుత్వం, మంత్రికి సంబంధం లేదా? అని బొత్స నిలదీశారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు, దేవుడు అంటే లెక్కేలేదని, కుర్చీ కోసం ఆరాటపడుతూ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని చెప్పారు. అందుకే ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభను వాకౌట్ చేశామని వివరించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications