జగన్..కేసీఆర్ మధ్య ఒన్ టు ఒన్ మీట్..! అధికారులకు నో ఎంట్రీ: అదే అజెండా..!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అవుతున్నారు. మధ్యలో విరామం తరువాత ఏపీ సీఎం జగన్..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ పైన కొద్ది రోజులుగా ఆసక్తి నెలకొని ఉంది. ఏపీలో జగన్ సీఎం అయిన తరువాత ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాయి. ఇచ్చి పుచ్చికొనే ధోరణితో వ్యవహరించాలని నిర్ణయించారు. గోదావరి జలాల వినియోగం పైన దాదాపు ఏకాభిప్రాయా నికి వచ్చారు.
అయితే, ఆ తరువాత కొద్ది కాలంగా ఇద్దరు సీఎంలు మధ్య సమావేశాలు లేవు. ఆ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారమూ సాగింది. అయితే, ఇప్పుడు తిరిగి ఇద్దరు సీఎంల సమావేశం తో రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తి నెలకొని ఉంది. అయితే, ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటి వరకు అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో..ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఒన్ టు ఒన్ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఇద్దరు ఏకాంత సమావేశంలో ఏం చర్చిస్తారనేది మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. ఆయన సోమవారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో గతంలో జరిగిన విధంగానే అధికారుల సమక్షం లో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల మీద చర్చిస్తారని భావించారు. అయితే, అందుతున్న సమాచారం మేరకు ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల అధికారులకు అధికారిక సమాచారం లేదు.
కానీ, జగన్ తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశం మాత్రం ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమావేశంలో అధికారులతో సంబంధం లేకుండా ఇద్దరు మఖ్యమంత్రులు ఒన్ టు ఒన్ సమావేశం కానున్నారని తెలుస్తోంది. దీంతో..ఇది పూర్తిగా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మాత్రమే జరిగే సమావేశంగా భావిస్తున్నారు. కొద్ది కాలంగా నిలిచిపోయిన భేటీలతో..వారిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందనే ప్రచారానికి సమాధానంగా వారు సమావేశం అయి..చర్చించుకొనే అవకాశం కనిపిస్తోంది.
తగ్గిన వేగం..గతం కంటే భిన్నంగా..
ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఇద్దరు ముఖ్యమంత్రులు పలు దఫాలు భేటీ అయ్యారు. ప్రగతి భవన్ కు ఏపీ సీఎం..అదే విధంగా అమరావతికి తెలంగాణ ముఖ్యమంత్రి రాక పోకలు సాగాయి. అదే సమయంలో గోదావరి జిలాలను రెండు రాష్ట్రాల వినియోగం పైనా చర్చలు జరిగాయి. అసెంబ్లీలోనూ దీని పైన సీఎం జగన్ తమ చర్చలు..ప్రతిపాదనల పైన వివరించారు.
కానీ, ఆ తరువాత ఆ ప్రతిపాదనను పక్కన పెట్టనట్టుగా కనిపిస్తోంది. ఇక, తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సమయంలోనే ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం దిశగా వేగంగా అడుగులు పడ్డాయి. దీని పైన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వంలో చర్చకు కారణమయ్యాయి. ఇక, కేంద్రం సైతం వీరిద్దరి సంబధాల పైన ఫోకస్ చేసినట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం ఉంది. ఇక, దిశ చట్టం సమయంలో అసెంబ్లీ వేదికగా తెలంగాణ మఖ్యమంత్రి కేసీఆర్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాట్సాఫ్ చెప్పారు.
ఈ సమావేశంలో అన్నింటికీ క్లారిటీ..
ఇక, ఇప్పటి వరకు అధికారికంగా ఈ భేటీ గురించి సమాచారం లేదు. కానీ, ఇద్దరు ముఖ్యమంత్రులు మధ్య మర్యాద పూర్వక భేటీ అని మాత్రం తెలుస్తోంది. ఈ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులే ఉండే అవకాశం ఉండటంతో..రాజకీయంగా ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. విద్యుత్ ఉద్యోగుల సమస్య..9,10 షెడ్యూల్ ఆస్తుల పంపకాలు..కేంద్రంతో రాజకీయ సంబంధాలు..కేంద్రం నుండి పన్ను వాటాల పెంపు పైన ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఏపీలో మూడు రాజధానుల అంశం..పరిపాలనా రాజధాని విశాఖ కు తరలించే నిర్ణయం పైన కేసీఆర్ తో ముఖ్యమంత్రి జగన్ చర్చిస్తా రని అంచనా.
దీంతో..విరామం తరువాత ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మరోసారి భేటీ రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తి కరంగా మారుతోంది.