బాబు రాకతో అరిష్టం: బొత్స, మేథాపట్కర్ ఆగ్రహం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాకతో రాష్ట్రానికి అరిష్టం పట్టుకుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గురువారం ధ్వజమెత్తారు. గత తెలుగుదేశం పార్టీ పాలన పునరావృతం అవుతోందన్నారు.
భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కాయన్నారు. త్వరలోనే ప్రజా ఉద్యమాలు చేపడతామని చెప్పారు.
రాజాధాని ప్రాంతంలో మేథా పాట్కర్ బృందం పర్యటన
ఏపీ నూతన రాజధాని ప్రాంతంలో మేథా పాట్కర్ బృందం పర్యటించారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో పంటల పొలాలను పరిశీలించారు. చంద్రబాబు ప్రభుత్వం సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులతో రైతులను భయపెట్టి భూములు లాక్కున్నారని మేథాపాట్కర్ ఆరోపించారు. రైతులకు తాము అండగా ఉంటామని చెప్పారు.
ఏపీకి పరిశ్రమలకు కాంగ్రెస్, వైసీపీలే అడ్డు: దేవినేని
ఏపీకి పరిశ్రమలు రాకుండా కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు అడ్డుపడుతున్నాయని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వేరుగా ఆరోపించారు. ఏపీలో పూర్తి పారదర్శకతతో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. పట్టిసీమలో రూ.500కోట్ల అవినీతి జరిగిందన్న రఘువీరా రెడ్డి ఆరోపణలు అర్థరహితమన్నారు. పోలవరం జాప్యానికి వైయస్ ప్రధానకారకుడన్నారు.