'చంద్రబాబుకు చెంపపెట్టు, అందరూ రాజీనామా చేయాలి, 21న కలిసిరండి'
అమరావతి: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇవ్వడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మంగళవారం స్పందించారు. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు.
2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ అంశమై హైకోర్టు మంగళవారం 22 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా బొత్స మాట్లాడారు.

వెంటనే రాజీనామా చేయాలి
హైకోర్టు నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని బొత్స చెప్పారు. చంద్రబాబుకు, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మా పోరాటం కొనసాగుతుంది
చంద్రబాబు వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని బొత్స అభిప్రాయపడ్డారు. పార్టీ మారిన వారి మంత్రులు కూడా అయ్యారని, వారు రాజీనామా చేయాలన్నారు. ప్రత్యేక హోదాతోనే ఏపీకి లాభమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

21న అవిశ్వాసం పెడుతున్నాం కలిసి రండి
తాము ఈ నెల 21వ తేదీన కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని బొత్స చెప్పారు. తెలుగుదేశం పార్టీ తమకు మద్దతివ్వాలన్నారు. టిడిపికి చిత్తశుద్ధి ఉందో లేదో తెలిసిపోతుందన్నారు. అవిశ్వాసం విషయమై తాము అన్ని పార్టీలను కలుస్తామన్నారు.

మంత్రిని తొలగించాలి
గుంటూరులో కిందిస్థాయి ఉద్యోగులపై చర్యలు సరికాదని బొత్స సత్యనారాయణ అన్నారు. సంబంధిత మంత్రిని వెంటనే తొలగించాలని మండిపడ్డారు. గుంటూరులో అతిసార అంశం కలకలం రేపింది. ఈ అంశంపై బొత్స పైవిధంగా స్పందించారు. ఎంతసేపు ఎమ్మెల్యేల కొనుగోలేనా, ప్రజా సమస్యలు పట్టవా అని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications