ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే: బొత్స, అచ్చెన్నాయుడు ఏమన్నారు?
రాజమండ్రి: నగరంలోని కోటగుమ్మం పుష్కరఘాట్ తొక్కిసలాటకు కారణం ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజమండ్రి పుష్కరాల్లో చంద్రబాబు అంతా తానే అంటూ ఏ కార్యక్రమాలను జరగనీయకుండా ప్రభుత్వ యంత్రాగాన్ని తన చుట్టూ తిప్పుకున్నారని అన్నారు. పుష్కరాలపై కేబినెట్లో ఏ మంత్రికి బాధ్యతలు అప్పగించలేదని మండిపడ్డారు.

పుష్కర పనులను సమీక్షించాల్సిన దేవాదయ శాఖ మంత్రిని కూడా అవమానపరిచేలా చంద్రబాబు తీరు ఉందన్నారు. తాను చాలా అనుభవజ్ఞుడినని ప్రచారం చేస్తూ రాజకీయలబ్ది పొందాలని చూశారని చంద్రబాబుపై బొత్స విమర్శలు గుప్పించారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి: అచ్చెన్నాయుడు
గోదావరి పుష్కరాల్లో భాగంగా రాజమండి కోటగుమ్మం పుష్కరఘాట్లో మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 8 మంది మృతి చెందినట్టు ఏపి మంత్రి అచ్చెన్నాయుడు తెలపారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారని, ఈ సాయంత్రానికి మృతులను జిల్లాకు తీసుకొస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ ఘటన చాలా విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications