కుటుంబంతో సహా బొత్స: జగన్పార్టీలో ఇమడగలరా?
హైదరాబాద్: పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ మరో నాలుగైదు రోజుల్లో వైసీపీలో చేరనున్నారు. ఈ నెల 7వ తేదీన ఉదయం హైదరాబాద్లోని లోట్సపాండ్లో వైసీపీ అధ్యక్షులు జగన్ సమక్షంలో కుటుంబసమేతంగా ఆయన ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు.
ఆ రోజు భార్య, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, సోదరులు, మాజీ ఎమ్మెల్యేలు అప్పల నరసయ్య, అప్పల నాయుడులతో కలిసి బొత్స పార్టీలో చేరనున్నారు. వీరితో పాటు మరో 15 మంది ముఖ్యమైన నాయకులు, అనుచరులు కూడా కండువా కప్పుకొంటారు.
ఆ తర్వాత ఈ నెలాఖరులో విజయనగరంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. విజయనగరం జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనే షరతుతోనే బొత్సను జగన్ తమ పార్టీలోకి తీసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి.
బొత్స విజయనగరం వ్యవహారాల్లో తలదూర్చవద్దని, దీనిని ఉల్లంఘించిస్తే హైదరాబాద్కే పరిమితం కావాల్సి ఉంటుందంటూ వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు కోలగట్ల వీరభద్రస్వామి సోమవారం జిల్లాలోని గుర్ల మండల పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించడం గమనార్హం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆశాభావంగా లేనందునే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.
అయితే, బొత్స వైసీపీలో ఇమడగలరా అనే చర్చ సాగుతోంది. అప్పుడే విజయనగరం వ్యవహారాల్లో తలదూర్చవద్దనే కొందరు చెబుతున్నారు. వైయస్ అత్యంత సన్నిహితునిగా ఉన్న బొత్స పలు కేబినెట్ సమావేశాల్లో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేవారు.
కొన్ని సందర్భాల్లో వైయస్ నిర్ణయంతో కూడా విభేదించేవారు. అయితే వైయస్ దానిని ఒక చర్చగా మాత్రమే భావించి తేలిగ్గా తీసుకునేవారు. ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా పని చేసిన రోశయ్య, కిరణ్ ప్రభుత్వ హయాంలోనూ సత్తిబాబు స్వతంత్రంగా వ్యవహరించేవారు. ఇలాంటి బొత్స జగన్ పార్టీలో ఇమడగలరా అనే చర్చ సాగుతోంది.