విజయనగరంలో కాంగ్రెస్ ఖాళీ?: బొత్సపై కన్నేసిన బిజెపి
హైదరాబాద్: మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను తమ పార్టీలో చేర్చుకునేందుకు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారంతో విజయనగరం జిల్లా కాంగ్రెస్లో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన బొత్స అధికారం కోల్పోయాక ఇప్పుడు హైదరాబాద్కే పరిమితమవుతున్నారు.
కాగా, తాజాగా ఆయనపై బిజెపి కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్న పదేళ్లు జిల్లా రాజకీయాలను, పాలనా వ్యవహారాలను బొత్స తన గుప్పెట్లో పెట్టుకున్నారు. కానీ విభజన సమయంలో ఆయన వ్యవహరించిన తీరుపై ఆగ్రహించిన ప్రజలు బొత్సతో పాటు అతని కుటుంబీకులను ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు.

ఎన్నికల్లో తగలిన ఎదురుదెబ్బతో జిల్లాలోని పార్టీ నాయకులు నిస్తేజంలో ఉండిపోగా, వారిలో ఉత్తేజం నింపవలసిన బొత్స అదేమీ పట్టనట్లుగా ఉంటూ ఎక్కువకాలం హైద్రాబాద్కు పరిమితం కావటంతో ఆయన మద్దతుదారులు కూడా క్రమంగా ఎవరిదారి వారు చూసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇందుకూరి రఘురాజు, విజయనగరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ముద్దాడ మధు కాంగ్రెస్కు రాజీనామా చేసి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. బొత్స గ్రీన్సిగ్నల్తోనే వీరిరువురు బిజెపిలో చేరారనే ఒక ప్రచారం ఉండగా, కాంగ్రెస్లో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండదనే కారణంగా వీరు బొత్సతో విభేధించి పార్టీని వీడారని మరో ప్రచారం కూడా కొనసాగుతోంది.
తాజాగా బొత్సను పార్టీలోకి ఆహ్వానించేందుకు బిజెపి అగ్రనాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం కాంగ్రెస్లో కలకలం రేపుతోంది. బొత్స బిజెపిలో చేరితే ఇక జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ అయినట్లే. అయితే బొత్స బిజెపిలో చేరతారా? లేదా? అనేది కొంతకాలం వేచిచూడాల్సిందే.












Click it and Unblock the Notifications