బైబిల్ పట్టుకుని విజయమ్మ చెప్పలేదా: టీపై బొత్స
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు అనుసరిస్తున్న వైఖరిపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చెప్పలేదా అని ఆయన అడిగారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి సాక్షిగా ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తెలంగాణపై మాట తప్పారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన విషయం ప్రజలందరికీ తెలుసునని ఆయన అన్నారు.
తాము తెలంగాణకు వ్యతిరేకమని పార్టీ ప్లీనరీలో వైయస్ జగన్ చెప్పలేదని ఆయన అన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించవచ్చునని జగన్ చెప్పలేదా అని ఆయన అడిగారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెసు అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీయే నిర్ణయం తీసుకోవాలని, ఆ పార్టీ నిర్ణయాన్ని తాము సమర్థిస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పిందని ఆయన గుర్తు చేశారు.
ఒక్కటి రెండు పార్టీలు తప్ప రాష్ట్రంలోని అన్ని పార్టీలు విభజనకు అనుకూలగా చెప్పాయని ఆయన అన్నారు. వైయస్ జగన్, చంద్రబాబు నాయుడు విభజనపై మాట మార్చారని ఆయన విమర్శించారు. చంద్రబాబు మాటల్లో సమైక్యమనే మాట రాలేదని ఆయన గుర్తు చేశారు. సమస్యలను చూసి భయపడే తత్వం కాంగ్రెసు పార్టీది కాదని ఆయన అన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను కేంద్రానికి చెప్పడానికి, సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే తాము పదవుల్లో ఉన్నామని ఆయన చెప్పారు.
కాంగ్రెసుకు ఉన్న నిబద్ధత తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు లేదని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి నిర్ణయం బాధాకరమని, తాను తీవ్రంగా నిరాశకు గురయ్యానని ఆయన చెప్పారు. కాంగ్రెసు అధికారంలో ఉంది కాబట్టి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుని నిర్ణయం చేసిందని, అందువల్ల తమ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడం సహజమని ఆయన అన్నారు. కాంగ్రెసు రాజకీయ ప్రయోజనం కోసం రాజకీయ కోణంలో నిర్ణయం చేయలేదని, అలా చేయబోదని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్న తమపై ఆ ప్రాంత ప్రజలు తమపై ఆగ్రహం వ్యక్తం చేయడం సహజమేనని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన తీర్మానం శాసనసభకు వచ్చినప్పుడు వ్యతిరేకించాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలు అట్టుడుకుతున్నాయని ఆయన అన్నారు. వైయస్ జగన్వి మోసపూరితమైన మాటలని ఆయన అన్నారు. యుపిఎ నిర్ణయం తీసుకోవడానికి ముందయినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జగన్ అనలేదని, తానూ ముఖ్యమంత్రీ తమ అభిప్రాయాలు చెప్పామని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు విమర్శలు చేస్తున్నాయని బొత్స అన్నారు. జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని, సీమాంధ్రపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. బంద్కు పిలుపు ఇవ్వడానికి జగన్కు ఏం అర్హత ఉందని ఆయన ప్రశ్నించారు.