ఏపీకి అప్పులెందుకు పుట్టడం లేదంటే ? అక్కడ పడింది బ్రేకు- అసలు రీజన్ ఇదే
ఏపీలో విభజన తర్వాత ఆర్ధిక పరిస్ధితులు నానాటికీ దిగజారుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మొదలైన భారీ అప్పుల పరంపర ఇప్పుడు రెట్టింపైంది. వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున అమలు చేస్తున్న పథకాల కారణంగా అప్పులు కూడా అదే స్ధాయిలో పెరుగుతున్నాయి. దీంతో ఆర్ధిక సంక్షోభం దిశగా పరిస్ధితులు పయనిస్తున్నాయి. దీన్ని గమనించిన కేంద్రం.. ఇప్పుడు జాతీయ బ్యాంకులకు సైతం అప్పులిచ్చే విషయంలో బ్రేకులు వేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తున్నాయి.
అప్పులాంధ్రప్రదేశ్
ఏపీలో విభజన తర్వాత గత ఎనిమిదేళ్లలో భారీగా అప్పులు పెరుగుతూ పోతున్నాయి. ఏపీ తీసుకుంటున్న అప్పులు చూస్తుంటే కేంద్రంతో పాటు బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలు కూడా అవాక్కవుతున్నాయి. ఖజానా ఖాళీగా ఉందని తెలిసి మొదలుపెట్టిన భారీ సంక్షేమ పథకాల కోసం చేస్తున్న అప్పులు తిరిగి సగటు జీవి ఉసురుతీసేలా ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అప్పులపై దేశవ్యాప్తంగా చర్చించుకోవాల్సిన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం ఈ విషయంలో పలు ఆంక్షలు విధిస్తుండటంతో అప్పులకు బ్రేకులు పడటం మొదలైంది.
ఎఫ్ఆర్బీఎం రూపంలో మొదలు
ఏపీలో వైసీపీ సర్కార్ చేస్తున్న అప్పుల్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితుల రూపంలో బ్రేకులు వేయడం మొదలుపెట్టింది. మిగతా రాష్ట్రాలతో సమానంగా అప్పులు తీసుకునేందుకు వీలుగా ఉన్న ఎఫ్ఆర్బీఎం పరిమితుల్ని కరోనా సమయంలో షరతులతో కాస్త సడలించినా ఇప్పుడు తిరిగి సాధారణ స్ధాయికి వచ్చేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటి ఎట్టి పరిస్ధితుల్లోనూ అప్పులు తీసుకోవద్దని చెబుతోంది. అయినా వైసీపీ సర్కార్ మాత్రం ఇంకా ఎఫ్ఆర్బీఎం పరిమితిని దాటేసి మరీ అప్పులు చేస్తోందని విపక్షాలు నిత్యం ఆరోపిస్తూనే ఉన్నాయి.
బ్యాంకులకు కేంద్రం అలర్ట్
ఏపీ ప్రభుత్వం ఆర్ధిక పరిస్ధితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. అయినా సంక్షేమ జాతరను కొనసాగించేందుకే ప్రభుత్వం
మొగ్గు చూపుతోంది. ఖజానాతో సంబంధం లేకుండా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం ఆర్ధిక వ్యవస్ధపై తీవ్రంగా పడుతుందని తెలిసినా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. దీంతో కేంద్రం మరో రూపంలో ఏపీ సర్కార్ ను కట్టడి చేయడం మొదలుపెట్టింది. ఏపీ ఆర్ధిక పరిస్ధితి దృష్ట్యా జాతీయబ్యాంకులేవీ విచ్చలవిడిగా అప్పులివ్వకుండా కేంద్రం వాటికి అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీకి అప్పులిచ్చే విషయంలో జాతీయ బ్యాంకులు కూడా ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి.
Recommended Video
కేంద్రాన్ని జగన్ వేడుకున్నా !
ఏపీకి సునాయాసంగా అప్పులిచ్చే విషయంలో జాతీయబ్యాంకులకు కేంద్రం జారీ చేసిన అలర్ట్ ను తొలగించాలంటూ సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనలో కేంద్రంలోని పెద్దల్ని కోరారు. ఏపీఎస్టీసీ మోడల్ లో కార్పోరేషన్లు అప్పులు తీసుకునే విషయంలో ప్రధానంగా బ్యాంకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఈ విధానంలో రుణాలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని, ఈ మేరకు బ్యాంకులకు ఇచ్చిన అలర్ట్ ను వెనక్కి తీసుకోవాలని సీఎం జగన్ ప్రధాని మోడీని కోరినట్లు తెలుస్తోంది. అయినా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఇప్పటికే ఎపీఎస్డీతో పాటు రాష్ట్రంలోని ఇతర కార్పోరేషన్లకు రుణం ఇచ్చేందుకు అంగీకరించిన బ్యాంకులు కూడా ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నాయి. దీంతో కొత్తగా అప్పులు పుట్టలేని పరిస్ధితి దాపురిస్తోంది.