నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్.. ఎందుకంటే!!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. నారా లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది.
ఎన్ని అవాంతరాలు ఎదురైనా, కేసులు నమోదైనా సరే లోకేష్ మాత్రం తన పాదయాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా నారా లోకేష్ పాదయాత్రకు బ్రేక్ పడింది. పాదయాత్రకు నాలుగు రోజుల పాటు విరామం ప్రకటించారు నారా లోకేష్. ఈ నెల 27, 28 తేదీలలో రాజమండ్రిలో టిడిపి మహానాడు జరగనున్న నేపథ్యంలో ఆయన పాదయాత్రకు విరామం ప్రకటించారు.

తిరిగి నారా లోకేష్ పాదయాత్ర 30వ తేదీన ప్రారంభం కానుంది. 30వ తేదీన కడప జిల్లా జమ్మలమడుగు నుండి నారా లోకేష్ తన పాదయాత్రను కొనసాగించనున్నారు. ఇక నేడు జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం, పెద్దపసుపుల గ్రామాల మీదుగా పాదయాత్రను కొనసాగించారు. నారా లోకేష్ పాదయాత్ర లో అడుగడుగునా ప్రజలు స్వాగతం పలికారు.
ప్రజల సమస్యలను ప్రజల కష్టాలను నారా లోకేష్ అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని నారా లోకేష్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్ ఇవాళ జగన్ దివాలా ప్రభుత్వాన్ని చూసి కాంట్రాక్టర్లు పారిపోతున్నారని విమర్శించారు. ఏపీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని , కనీసం తట్ట మట్టి పోసే దిక్కు కూడా లేదని లోకేష్ మండిపడ్డారు.
గత నాలుగేళ్లుగా గ్రామపంచాయతీ లను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. డబ్బులు పెట్టి పనులు చేయించిన సర్పంచులు ప్రభుత్వం నుంచి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. అందుకే టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించాలన్నారు. రైతు సంక్షేమం కోసం కూడా పాటుపడతామని అన్నారు.

నేడు పాదయాత్ర ముగించుకుని కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకొని, ఆపై అమరావతికి వెళ్లనున్నారు. రేపు శుక్రవారం అమరావతి నుండి బయలుదేరి రాజమండ్రిలో మహానాడు ప్రాంగణానికి లోకేష్ వెళ్లనున్నారు. టిడిపి మహానాడు నేపథ్యంలోని నారా లోకేష్ పాదయాత్రకు బ్రేక్ పడినట్టుగా తెలుస్తుంది.












Click it and Unblock the Notifications