రూ.125 కోట్లతో సీఎం జిల్లాలో 'బ్రిటానియా', బాబుతో పదేళ్లలో ఏపీ అదుర్స్!: వరుణ్
విజయవాడ: బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దాదాపు రూ.125 కోట్ల పెట్టుబడితో చిత్తూరు జిల్లాలో నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో బ్రిటానియా ఎండీ వరుణ్ బెర్రీ సోమవారం నాడు విజయవాడలో భేటీ అయ్యారు. చెన్నై, బెంగళూరు మార్కెట్ అవసరాలు తీర్చేందుకు ఏపీలో యూనిట్ నెలకొల్పేందుకు అనువైన ప్రదేశం కావాలని కోరారు.
దీనికి సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లాను సూచించారు. డైరీ రంగంలో ఉన్న విస్తృత అవసరాలు సద్వినియోగం చేసుకోవాలని బ్రిటానియా ఎండీకి సూచించారు. దీంతో, చిత్తూరు జిల్లాలో రూ.125 కోట్లతో ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు బ్రిటానియా కంపెన సంసిద్ధత వ్యక్తం చేసింది.
తొలి దశ ప్రాజెక్టు పనులను వచ్చే ఏడాది చివరలో ప్రారంభించనుంది. చిత్తూరు జిల్లా.. కంపెనీ అవసరాలు తీరుస్తుందని, ఆ ప్రాంతం అనువుగా ఉంటుందని చంద్రబాబు బ్రిటానియా ఎండీకి సూచించిన నేపథ్యంలో ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పౌల్ట్రీ, ఉద్యాన, ఫిషరీస్, పశు గణాభివృద్ధి, డెయిరీ రంగాల్లో 24 శాతం వృద్ధి సాధించామన్నారు. డెయిరీ రంగంలోనూ విస్తృత అవకాశాలున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో అగ్రస్థానం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. బ్రిటానియా వ్యాపారంలో 75% వాటా బిస్కట్లదేనని, కేక్స్, డెయిరీ ఉత్పత్తులు, రస్కుల తయారీలోనూ కంపెనీ నిమగ్నమైందని ఈ సందర్భంగా వరుణ్ వివరించారు. మరో పదిపదిహేను సంవత్సరాల్లో చంద్రబాబు విజన్తో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రరాష్ట్రంగా మారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.