దిష్టిబొమ్మ దహనం: ఎస్కేయూ వర్సిటీలో బీటెక్ విద్యార్థినిపై లెక్చరర్ వేధింపులు
అమరావతి: బీటెక్ ఫైనలియర్ విద్యార్థినిపై శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్ వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... ఎస్కేయూ వర్సిటీ ఈఈఈ విభాగంలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై లెక్చరర్ వేధింపులకు పాల్పడ్డాడు.
గతంలో కూడా ఇదే లెక్చరర్ ఓ విద్యార్ధినితో అసభ్యంగా ప్రవర్తించడంతో కాలేజీ ఉన్నతాధికారులు మెమో జారీ చేశారు. అయినప్పటికీ ఇతగాడి వంకర బుద్ధి మాత్రం మారలేదు. తాజాగా లెక్చరర్ తనను వేధిస్తున్నట్టు ఫైనలియర్ విద్యార్ధిని ప్రిన్సిపాల్ రాఘవేంద్రరావుకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
దీనిపై ప్రిన్సిపాల్ను సంప్రదించగా సంబంధిత అధ్యాపకుడిపై చర్యలు తీసుకోనునట్లు తెలిపారు. ఈ విషయంపై రిజిస్ట్రార్కు కూడా వివరించినట్లు ఆయన తెలిపారు. వేధింపులకు పాల్పడినందుకు గాను అతడిని తొలగించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ఎస్కేయూ ఐక్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వేధింపులకు పాల్పడుతున్న ఇంజనీరింగ్ కళాశాల ఈఈఈ అధ్యాపకుడి దిష్టిబొమ్మను వర్శిటీ ముఖద్వారం వద్ద దహనం చేశారు.
వీసీ బంగ్లాలో చోరీకి విఫలయత్నం
ఎస్కేయూ వర్సిటీ వీసీ ఆచార్య కే.రాజగోపాల్ అధికార నివాసంలో శనివారం రాత్రి ఇద్దరు దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. వీసీ బంగ్లా వెనుక వైపు నుంచి దొంగలు చొరబడగానే సెక్యూరిటీగార్డులు విజిల్ వేయడంతో గోడ దూకి పారిపోయారు. ఈ విషయాన్ని సెక్యూరిటీ గార్డులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ఎస్కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వెంకటరమణ ఆదివారం ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీలో పోలీసు భద్రత పెంచాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.