జగన్కు చెప్పేశా: దిగిరానంటున్న వైసిపి నేత బూచేపల్లి
ఒంగోలు: పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు ఫైనల్గా చెప్పేశానని, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి కుదరదని దర్శి మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తమ కుటుంబం నిర్ణయం తీసుకుందని, అందులో మార్పు లేదని ఆయన అన్నారు.
దర్శిలో తనను కలిసిన నియోజకవర్గంలోని తన అనుచరులతో బూచేపల్లి మంగళవార మాట్లాడారు. దర్శి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమన్వయకర్తగా ఉన్న బూచేపల్లి వచ్చే ఎన్నికలలో పోటీ చేయకూడదని నిర్ణయించుకుని రెండు నెలల క్రితం ఆ విషయాన్ని ప్రకటించారు.

బాలినేని అయితే బాగుండేది.
దర్శి నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగితే బాగుంటుందని అదే విషయాన్ని పార్టీ అధినేత జగన్కు చెప్పానని, అయితే ఆ పార్టీ తీసుకున్నదే తుది నిర్ణయమని, ఆ ప్రకారమే ముందుకు నడవాలని ఆయన అన్నారు. అయితే నియోజక వర్గం ఇంచార్జీగా బాదం మాధవరెడ్డిని జగన్ ప్రకటించారు.

పోటీ చేయాలని ఆయనపై ఒత్తిడి...
నిర్ణయాన్ని మార్చుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుచరులు బూచేపల్లిని కోరారు. అయితే, తన నిర్ణయం మారదని ఆయన స్పష్టం చేశారు. తమ కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని జగన్కు చెప్పామని ఆ నిర్ణయంలో మార్పులేదని చెప్పారు.

పార్టీ నిర్ణయాన్ని గౌరవించాల్సిందే..
మాధవరెడ్డి విషయంలో పార్టీ నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. ఏమైనా ఉంటే వచ్చే నెల మొదటి వారంలో దర్శి వస్తానని అప్పుడు మాట్లాడుకుందామని చెప్పినట్లు తెలుస్తోంది.

ఆయన ఒక్కరే వచ్చారు..
సమావేశానికి బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఒక్కరే హాజరయ్యారు. ఇంతకు ముందైతే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తల్లిదండ్రులు సుబ్బారెడ్డి, వెంకాయమ్మలు వచ్చేవారు. ఈసారి వారు కార్యకర్తలను కలవలేదు. తమ ఇంటి వద్ద కాకుండా శివప్రసాద్రెడ్డి దర్శి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్వహించిన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం కావడం విశేషం.












Click it and Unblock the Notifications