"జగన్ ఓ బ్యాటరీ లేని సెల్ ఫోన్, రోజా వైసీపీకి పెయిడ్ వర్కర్"
విజయవాడ : అధికార టీడీపీ-ప్రతిపక్ష వైసీపీ మధ్య గత కొద్దిరోజులుగా మాటల యుద్దం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యే రోజా శుక్రవారం నాడు ప్రెస్ మీట్ పెట్టి సీఎం చంద్రబాబును, లోకేష్ ను కడిగిపారేశారు. దీంతో ఇప్పుడు రోజాకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు టీడీపీ నేతలు.
తాజాగా రోజా వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో ఘాటైన విమర్శలు చేశారు. జగన్ ఓ బ్యాటరీలేని సెల్ ఫోన్ అని ఎద్దేవా చేసిన వెంకన్న.. రోజాను వైసీపీ పెయిడ్ వర్కర్ అభివర్ణించారు. చంద్రబాబును ఎదుర్కోవడానికి వైసీపీ తరుపున రోజాను శిఖండిలా వదులుతున్నారని విమర్శించారు.
ఏపీ ప్రజలు జగన్ కు ప్రతిపక్ష హోదా ఇస్తే.. జగన్ మాత్రం హైదరాబాద్, బెంగుళూరుల్లోను కాలం గడుపుతున్నారని వెంకన్న ఆరోపించారు. ధర్నాల కోసం పొద్దున్నే వచ్చే జగన్.. సాయంత్రం కాగానే ఫ్లైట్ లో వెళ్లిపోతున్నారని విమర్శించారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు ఏపీకి రావాలనే యోచనలో జగన్ ఉన్నారని ఈ సందర్బంగా బుద్దా వెంకన్న తెలిపారు.