బడ్జెట్లో...ఆడవాళ్లకూ అన్యాయం: నన్నపనేని రాజకుమారి
తిరుపతి: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ తో పాటు మహిళలకు కూడా అన్యాయం జరిగిందని ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి ఆరోపించారు. అసలు బడ్జెట్లో మహిళా సంక్షేమం ప్రస్తావనే లేకపోవడం చాలా శోచనీయమని అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ...ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలోని అనేక రాష్ట్రాలలో మహిళలు...వ్యవసాయదారులుగా, కూలీలుగా ఉన్నారని...వారి గురించి కేంద్రం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ లో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రకటించిన ప్రత్యేక హోదా హామీల వూసే లేదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి, ఇతరత్రా భవనాల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాలని నన్నపనేని రాజకుమారి విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబుపై నమ్మకంతో ఎపిలో ఇతర దేశస్థులే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, అలాంటి కేంద్రం కూడా అదేవిధంగా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత సమావేశాల్లోనే ఏపీకి నిధులు ఇవ్వాలని ఆమె కేంద్రాన్ని కోరారు.