జగన్ పార్టీలోనే ఉంటా, అనుభవం లేకనే: ఎంపి రేణుక
న్యూఢిల్లీ: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక స్పష్టం చేశారు. రాజకీయానుభవం లేకనే తాను అయోమయానికి గురైనట్లు చెప్పారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు.
నియోజకవర్గం అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిసినట్లు తెలిపారు. తాను తేరుకునే లోపలే అంతా జరిగిపోయిందని అన్నారు. పార్టీ మారడంపై తన మీద ఏ విధమైన ఒత్తిడి లేదని రేణుక చెప్పారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయాలు మాని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. రుణమాఫీ, పెన్షన్లపై చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీలో చేరిన పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి పునరాలోచన చేస్తారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. నంద్యాల నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టికెట్పై గెలిచిన ఎస్పీవై రెడ్డి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.