కఠిన చట్టాలు లేకపోవడం వల్లే అత్యాచారాలు: ఎంపి రేణుక కంటతడి
కర్నూలు: కఠినమైన చట్టాలు లేకపోవడం వల్లే బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయిని వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు బుట్టారేణుక అన్నారు. చట్టాల్లో మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.
మంగళవారం ఉదయం అత్యాచార బాధితురాలైన బాలికను ఎంపీ పరామర్శించారు. ఈ సందర్భంగా బాలికను చూసి ఎంపీ కంటతడిపెట్టారు. కాగా, బాలికపై అత్యాచారం జరిపిన నిందితుడు ఖాజాను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట బిజెపి కార్యకర్తలు ధర్నా చేశారు. బాధిత బాలికను కర్నూలు ఎస్పీ కూడా పరామర్శించారు.
రేప్ నిందితుడిపై దాడికి యత్నం ఉద్రిక్తత
కర్నూలు ప్రభుత్వాస్పత్రి వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికపై అత్యాచారం కేసులో చికిత్స పొందుతున్న నిందితుడిపై ఓ వర్గం దాడికి ప్రయత్నించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్ద పరిస్థితిని అదుపులోకి తేవడానికి భారీగా మోహరించారు. పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీ చార్జీ చేశారు.
ఈ నేపథ్యంలో జనాలు ప్రతిదాడికి దిగడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడానికి సిద్ధమయ్యారు. నిందితున్ని తమకు అప్పగించాలంటూ పోలీసులతో బాధితులు వాగ్వాదానికి దిగినట్టు సమాచారం.
అత్యాచార ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఏడేళ్ల బాలికపై నిందితుడు ఖాజా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం కర్నూలు పట్టణంలోని కడగ్పూరా కాలనీలో వెలుగుచూసింది. కడగ్పూరా కాలనీకి చెందిన ఖాజాబాషా భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి తన ఇంటి పక్కనే ఉన్న ఏడేళ్ల పాపను ఎత్తుకెళ్లాడు.
పాప ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నిందితుడు శనివారం రాత్రి పాపపై అత్యాచారం చేసి ఆదివారం వదిలేయడంతో ఇంటికి చేరింది. తల్లిదండ్రులు జరిగిన విషయంపై ఆరా తీసి బాషాను పట్టుకొని చితకబాదారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని ఆస్పత్రిలో చేర్పించారు.