శోభకు మెజార్టీ వస్తే ఉప ఎన్నిక: ఈసి, ఓట్లు చెల్లుతాయి
హైదరాబాద్/కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి, దివంగత నేత శోభానాగి రెడ్డి ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిస్తే.. ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాసిన లేఖలో ఎన్నికల సంఘం వెల్లడించింది. శోభానాగిరెడ్డికి వేసే ఓట్లు చెల్లుతాయని ఎన్నికల సంఘం పేర్కొంది.
ఇంతకు ముందు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ మాట్లాడుతూ.. శోభానారెడ్డికి వచ్చే ఓట్లను చెల్లనివిగా పరిగణించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ 24న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, ఆ పార్టీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి శోభా నాగిరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే.
బుధవారం రాత్రి(ఏప్రిల్ 23న) నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు వెళ్తుండగా గూబగుండం మిట్ట సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టింది. బుధవారం నంద్యాలలో షర్మిలతోపాటు ఆమె పర్యటించారు. రాత్రి పదిన్నర గంటల సమయంలో షర్మిలకు వీడ్కోలు పలికి తన మిత్సుబిషి ఔట్ల్యాండర్ వాహనంలో శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డకు బయలుదేరారు. మరి కొన్ని నిమిషాల్లో ఆళ్లగడ్డకు చేరుకుంటారనగా గూబగుండం మిట్ట సమీపంలోని జాతీయ రహదారిపై స్థానిక రైతులు వేసిన ఆరబోసిన ధాన్యపు కుప్పల్లోకి ఆమె ప్రయాణిస్తున్న వాహనం దూసుకెళ్లింది.
ఒక్కసారిగా అదుపు తప్పి నాలుగు పల్టీలు కొట్టింది. రోడ్డుపక్కనే ఉన్న పొలంలో పడిపోయింది. వాహనంలో ముందు సీటులో కూర్చున్న శోభా నాగిరెడ్డి ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆమె మెడ, తల భాగానికి గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న శోభా నాగిరెడ్డిని అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శోభానాగిరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఆమెను గురువారం హైదరాబాదులోని ఓ కార్పోరేట్ ఆస్పత్రికి తరలించారు. పక్కటెముకలు విరిగడం, తలకు తీవ్రమైన గాయాలు కావడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.