రసవత్తరం..తేలిపోయింది: పవన్ డ్రాప్, ఆశలు లేకేనా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ లోకసభకు, ఆంధ్రప్రదేశ్లోని నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎల్లుండి ఉప ఎన్నికలు జరగనున్నాయి. మెదక్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఏపీలో నందిగామ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీ చేయడం లేదు. టీడీపీ, కాంగ్రెసు పార్టీలో బరిలో ఉన్నాయి. అయితే, టీడీపీ వైపే మొగ్గు ఉందని అందరూ భావిస్తున్నారు. నందిగామ పోటీ ఏకపక్షం అవుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
మెదక్ లోకసభ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. తెరాస తరఫున కొత్త ప్రభాకర్ రెడ్డి, టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి సునీత లక్ష్మా రెడ్డి బరిలో ఉన్నారు.
ప్రధానంగా బీజేపీ, తెరాసల మధ్యనే పోటీ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ వంద రోజుల్లో కేసీఆర్ చేసిందేమీ లేదని, బంగారు తెలంగాణ అంటూ ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపి.. ఇప్పుడు నరకం చూపిస్తున్నారని, మెదక్ ఉప ఎన్నికల్లో తెరాసను గెలిపిస్తే లాభం ఉండదని, జగ్గారెడ్డిని గెలిపిస్తే కేంద్రం నుండి నిధులు ఎక్కువగా తీసుకు వస్తారని బీజేపీ చెబుతోంది. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ప్రధానంగా కేసీఆర్ వంద రోజుల పాలనను చూపించి ఓట్లు అడుగుతున్నాయి.
తాము గత ప్రభుత్వాల లోటు పాట్లను సర్దే పనిలో ఉన్నామని, ఇప్పటి వరకు ఇంకా ఏది ప్రారంభించలేదని, ముందు ముందు తెలంగాణను అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దుతామని తెరాస చెబుతోంది. మెదక్ జిల్లా నర్సాపూర్ బహిరంగ సభలో కేసీఆర్ బుధవారం మాట్లాడారు. దూర ప్రాంతాల నుండి వచ్చి సర్వేను విజయవంతం చేసినట్లుగానే, ఎక్కడ ఉన్నా వచ్చి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, తనకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ రావాలని ఆయన కోరారు.
తెరాస బీజేపీ - టీడీపీ, కాంగ్రెసు పార్టీలకు డిపాజిట్లు కూడా రావొద్దని ప్రజలను కోరుతోంది. జగ్గారెడ్డి సమైక్యవాది అని, సమైక్యవాదికి టిక్కెట్ ఇచ్చిన బీజేపీ తన పరువు పోగొట్టుకుందని అందుకే ఆ పార్టీకి ఓటు వేయవద్దని తెరాస ఓటర్లను కోరుతోంది. ముఖ్యంగా.. జగ్గారెడ్డికి టిక్కెట్ వచ్చిన సమయంలో తెరాస జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును ప్రధానంగా టార్గెట్ చేశాయి.
అయితే, ఉప ఎన్నిక దగ్గర పడటం, పవన్ కళ్యాణ్ ప్రచారానికి రాకపోవడంతో.. ఆయనను తెరాస డ్రాప్ చేసింది. అయితే, బీజేపీకి టిడిపి మద్దతిస్తున్నందున ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబును టార్గెట్ చేసి మాట్లాడుతోంది. జగ్గారెడ్డి తరఫున పవన్, చంద్రబాబు ప్రచారం చేయవచ్చునని అందరూ భావించారు. అందుకే ముందు జాగ్రత్తగా తొలుత తెరాస పవన్ పైన విమర్శలు గుప్పించింది. సార్వత్రిక ఎన్నికల్లోనే పవన్ ప్రభావం కనిపించలేదని, ఇప్పుడేం చేస్తారని తెరాస నేతలు విమర్శించారు.
అయితే, పవన్ కళ్యాణ్ ప్రచారానికి వచ్చే అవకాశాలు కనిపించక పోవడంతో క్రమంగా ఆయన పైన విమర్శలు తగ్గించిందని చెప్పవచ్చు. చంద్రబాబు ప్రచారానికి రాకపోయినప్పటికీ.. తెలంగాణ టీడీపీ నేతల విమర్శలకు ఘాటుగా సమాధానం చెప్పడం కోసం చంద్రబాబును టార్గెట్ చేసింది. ఇక, అలాగే కాంగ్రెసు పార్టీ పదేళ్ల పాలన పైన విరుచుకుపడుతోంది.
ఇదిలా ఉండగా.. మెదక్ సీటు పైన కాంగ్రెసు పార్టీ ఆశలు వదిలేసుకున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ స్థాయి నేతలు ఎవరు కూడా ప్రచారానికి రాకపోవడంతో స్థానిక నేతలు డల్ అవడమే కాకుండా.. మొక్కుబడిగా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ముఖ్య నేతలతో చివరి ఏడు రోజుల్లో ఏడు బహిరంగ సభలు పెట్టి తెరాస, బీజేపీకి ధీటుగా ప్రచారం చేయాలని తొలుత కాంగ్రెసు భావించిందని, కానీ, ఎవరు ప్రచారం చేసినా లాభం ఉండదనే ఉద్దేశ్యంతోనే జోష్ కనిపించడం లేదంటున్నారు.
ప్రచార కమిటీలో ఉన్న ముఖ్య నేతలు కూడా ప్రచారానికి రాలేదని గుర్తు చేస్తున్నారు. ఎన్నికలకు ముందే ఫలితాలు తేలిపోయినందువల్లే అధిష్టానం, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆసలు వదిలేసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ, తెరాసల మధ్య రసవత్తర పోటీ ఉంటుందని అందరూ భావిస్తున్నారు.