రాయలసీమను మోడీ తీసుకోవాలి: బైరెడ్డి, బాబుకు పట్టిసీమ ఝలక్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రాయలసీమ జిల్లాలను దత్తత తీసుకోవాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి బుధవారం డిమాండ్ చేశారు. ఆయన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జల దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. నీటి కేటాయింపుల్లో రాయలసీమ జిల్లాలకు అన్యాయం జరుగుతోందన్నారు. అందుకే తాను జలసాధన దీక్షను చేపట్టానని తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు ఎలాంటి ఉపయోగం లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఝలకిచ్చారు.
పట్టిసీమ వల్ల రాయలసీమకు మంచి ఉపయోగం ఉంటుందని ఏపీ ప్రభుత్వం చెబుతోన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. సీమ జిల్లాలను ప్రధాని దత్తత తీసుకోవాలని, పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలివ్వాలన్నారు.
కాగా, బైరెడ్డి దీక్షలో రాయలసీమకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. రాయలసీమ హక్కుల పరిరక్షణ, న్యాయంగా దక్కాల్సిన నీటి కేటాయింపులపై కేంద్రం దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
మోడీ, వెంకయ్యలపై రఘువీరా ఫిర్యాదు
ప్రధాని మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుల పైన ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి పెనుగొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను వారు మోసం చేశారన్నారు. ఓటుకు నోటు కేసులో భయపడటమే చంద్రబాబుకు కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ అని ఎద్దేవా చేశారు.