ధర్మాన కామెంట్స్ పై బైరెడ్డి ఫైర్-ఉత్తరాంధ్ర కాదు.. రాయలసీమనే ప్రత్యేక రాష్ట్రం చేయండి..
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు అమరావతే కాదు ఉత్తరాంధ్ర, రాయలసీమలోనూ చిచ్చు రేపుతోంది. విశాఖకు రాజధాని ఇవ్వకపోతే ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయమంటూ వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తాజాగా చేసిన వ్యాఖ్యల్ని రాయలసీమ సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇవాళ తీవ్రంగా తప్పుబట్టారు.
వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ఉత్తరాంధ్ర రాజధాని కోసం రాజీనామా చేయాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. మంత్రి ధర్మానకు చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఆ పని చేయాలన్నారు. గతంలో విశాఖ ఉక్కు కోసం రాయలసీమ వాసులు ప్రాణత్యాగాలు చేశారని బైరెడ్డి గుర్తుచేశారు. రాయలసీమ వాసులు ప్రాణ త్యాగాలు చేయకపోతే విశాఖకు స్టీల్ ప్లాంట్ వచ్చేదా అని ఆయన ప్రశ్నించారు. ఆ విషయాన్ని మంత్రి ధర్మాన గుర్తుంచుకోవాలని బైరెడ్డి సూచించారు.
అమరావతి నుంచి రాజధానిని మారిస్తే కర్నూలుకు మంత్రి ధర్మాన మద్దతు ఇవ్వాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోరారు. నిధులు, నీళ్లు, నియామకాల విషయంలో అన్యాయం జరిగితే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాల్సిందేనని బైరెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే రాయలసీమ అన్ని విధాలుగా నష్టపోయిందని ఆయన అన్నారు. గతంలో రాయలసీమ హక్కుల వేదిక పేరిట సంస్ధ ఏర్పాటు చేసి పోతిరెడ్డి పాడు వంటి ప్రాజెక్టుల విషయంలో కొట్లాడిన బైరెడ్డి గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ధర్మాన ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న డిమాండ్ పై ఆయన స్పందించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.