ఊహించని ట్విస్ట్లు: బాబు వద్దకు బైరెడ్డి! జగన్ కోసం శ్రీదేవి వద్ద అనుచరుడి లాబీయింగ్
కర్నూలు: కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు అధికార టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. బరి నుంచి ప్రతిపక్ష వైసీపీ తప్పుకున్నప్పటికీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి అనుచరులు ఒకరు, మరో అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థులుగా ప్రస్తుతానికి బరిలో ఉన్నారు.
స్వతంత్రులను నామినేషన్ విత్ డ్రా చేయించేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ అభ్యర్థి కేఈ ప్రభాకర్ బుధవారం బైరెడ్డిని కలిసి సుదీర్ఘంగా చర్చించారు. బైరెడ్డి సీఎం చంద్రబాబును కూడా కలవనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అంశంతో పాటు ఆయన టీడీపీలో చేరే అంశం కూడా చర్చకు రానుందని తెలుస్తోంది.
బైరెడ్డిని కలిసిన కేఈ, వైసీపీ కోసం పావులు: వాళ్లే మార్చేశారు, జగన్ ఏం చేస్తారు?
ఏకగ్రీవం కోసం టిడిపి ప్రయత్నాలు
బైరెడ్డి అనుచరుడు పుల్యాల నాగిరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈయనతో పాటు దండు శేషు యాదవ్, పులి జయప్రకాశ్ రెడ్డిలు నామినేషన్ వేశారు. శేషుయాదవ్ నామినేషన్ ఈసి తిరస్కరించింది. శుక్రవారం వరకు ఉపసంహరణకు గడువు ఉంది. దీంతో టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది.
నిన్న నంద్యాలలోను బరిలోకి దించారు
పుల్యాల నాగిరెడ్డిని పోటీ నుంచి తప్పించే దిశగా టీడీపీ వ్యూహం పక్కాగా అమలు చేస్తోంది. అందుకే బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు బైరెడ్డితో కేఈ భేటీ అయ్యారు. ప్రధానంగా పుల్యాల నామినేషన్ విత్ డ్రా పైనే చర్చ జరిగిందని తెలుస్తోంది. గతంలో నంద్యాల ఉప ఎన్నికలో ఆర్పీఎస్ అభ్యర్థి పుల్యాలను బైరెడ్డి బరిలో దింపారు.
టీడీపీలో చేరేందుకు బైరెడ్డి ఆసక్తి
154 ఓట్లకు మించి ఆర్పీఎస్ అభ్యర్థికి రాకపోవడంతో ప్రజల్లో రాయలసీమవాదం లేదని ఆ పార్టీని బైరెడ్డి రద్దు చేశారు. అనంతరం టీడీపీలో చేరేందుకు పావులు కదిపారు. అనూహ్యంగా ఇప్పుడు మరోసారి తన అనుచరుడు పుల్యాలను బరిలోకి దింపారు. గతంలోనే బైరెడ్డి టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపించినప్పటికీ స్థానిక నాయకులు అడ్డుపడ్డారనే వాదనలు ఉన్నాయి.
ఇప్పుడు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!
ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా టీడీపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకోవచ్చునని అంటున్నారు. దీంతో ఇరువురికి లబ్ధి చేకూరవచ్చునని భావిస్తున్నారు. కానీ మరో అభ్యర్థి జయప్రకాశ్ రెడ్డి నామినేషన్ను ఉపసంహరించే ప్రయత్నంలో టిడిపి సఫలమైంది. ఆయన గురువారం పోటీ నుంచి తప్పుకున్నారు.
జగన్ మద్దతు కోసం శ్రీదేవి వద్ద లాబీయింగ్
మరోవైపు, బైరెడ్డి అనుచరుడు పుల్యాల నేతల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి కోట్లను కలిశారు. ఎమ్మెల్సీ ఎన్ని కల్లో కాంగ్రెస్ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు తనకు మద్దతు ఇప్పించేలా కృషి చేయాలని కోరారు. పత్తికొండ వైసీపీ ఇంచార్జ్ చెరుకులపాడు శ్రీదేవిని, బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని పుల్యాల కలిశారు. జగన్ను ఒప్పించి వైసీపీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్ల మద్దతు ఇప్పించాలని చెరుకులపాడు శ్రీదేవికి విన్నవించారు. ఈ విషయం జగన్ దృష్టికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.