శ్రీశైలం ప్రాజెక్ట్: చంద్రబాబుకు బైరెడ్డి హెచ్చరిక, ప్రకాశం జెడ్పీ కార్యాలయంలో ఉద్రిక్తత
కర్నూలు: రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి శుక్రవారం నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల నీటి మట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
లేదంటే అక్టోబర్ నుంచి రాయలసీమలో పాదయాత్ర చేస్తానని హెచ్చరించారు. ఆయన శుక్రవారం ఉదయం శ్రీశైలం జలాయం నీటిమట్టం పరిశీలించారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా నీటి విడుదల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఒంగోలు జెడ్పీ కార్యాలయంలో ఉద్రిక్తత
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో శుక్రవారం ఉదయం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కోల్పోయిన ఆ జిల్లా సీనియర్ రాజకీయ నేత ఈదర హరిబాబు... ఆ పదవి కోసం ఏకంగా సుప్రీం కోర్టు గడప కూడా తొక్కారు.
సుప్రీం కోర్టు తనకు అనుకూలంగా తీర్పునివ్వడంతో కోర్టు తీర్పు కాపీలను చేతబట్టుకుని ఆయన జిల్లా పరిషత్ కార్యాలయానికి వచ్చారు. అయితే, హరిబాబు వస్తున్నారని తెలుసుకున్న జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) జడ్పీ చైర్మన్ చాంబర్కు తాళం వేసుకుని వెళ్లారు.
గతంలోనూ ఈదరను అడ్డుకునేందుకు అధికారులు చైర్మన్ చాంబర్ కు తాళాలు వేశారు. తీర్పు కాపీతో జడ్పీకి వచ్చిన ఈదర హరిబాబు, అధికారుల వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.