కేబినెట్ అజెండాకు ఆమోదం: బ్రీఫింగ్ మాత్రమే..నిర్ణయాలు ఉండవు: ఇక..ఈసీ చేతిలో నిర్ణయం..!
కొద్ది రోజులుగా వివాదంగా మారిన ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహణకు తొలి అడుగు పడింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కేబినెట్ భేటీ నిర్వహణలో ఈసీ సూచించిన విధానం మేరకు తొలుత అజెండా ఖరారు చేసారు. సీఎస్ అధ్యక్షత సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అజెండాను ఆమోదించింది. దీనిని ఎన్నికల సంఘానికి నివేదించి ఎన్నికల సంఘానికి కేబినెట్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని సీఎస్ కోరనున్నారు.

అజెండా పై స్క్రీనింగ్ కమిటీలో చర్చ..
ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినప్పటి నుండి చర్చ..రచ్చగా మారింది. ఎన్నిల కోడ్ ఉన్న సమయంలో కేబినెట్ సమావేశం సాధ్యం కాదనే వాదన మొదలైంది. అయితే, ప్రధాని కోడ్ ఉన్న సమయంలో కేబినెట్ మీటింగ్ నిర్వహించారని..తమకు మాత్రమే ఎందుకు నిబంధనలు అంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కేబినెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలంటూ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంకు నోట్ పంపారు. దీని పైన సీఎస్ నేరుగా ముఖ్యమంత్రి కార్యదర్శిని పిలిపించి అజెండా ఇవ్వాలని కోరారు. దీనిని ఎన్నికల సంఘానికి నివేదించి వారి అనుమతితో కేబినెట్ నిర్వహించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో..కేబినెట్ సమావేశాన్ని ఈనెల 14వ తేదీకి వాయిదా వేసారు. ఇక, అజెండా ఖరారు చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం సీఎస్కు సమర్పించింది. దీని పైన స్క్రీనింగ్ కమిటీ చర్చించింది.

నాలుగు అంశాల పైనే చర్చ..
అజెండాలో ముందుగానే ఖరారు చేసిన విధంగా.. నాలుగు అంశాలకే కేబినెట్ భేటీ పరిమితం కానుంది. రాష్ట్రంలో తాగు నీటి ఎద్దడి, ఫోనీ తుఫాను ప్రభావం, ఉపాధి హామీ నిధుల వ్యవహారం, కరువు-సీజనల్ సమస్యల పైన మాత్రమే ఈ స్క్రీనింగ్ కమిటీ చర్చించింది. సంబంధిత శాఖల అధికారులు..ముఖ్య అధికారులతో సీఎస్ చర్చించారు. ఈ అంశాలకు స్క్రీనింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. అదే సమయంలో సీఎస్ అధికారులకు కొన్ని సూచనలు చేసారు. కేబినెట్ సమావేశంలో ఈ అంశాలకే పరిమితం కావాలని ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి తో సహా మంత్రులకు వివరించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సంఘానికి ఏదైతే నివేదిస్తున్నామో ఆ అంశాలకు మాత్రమే లోబడి చర్చ జరగాల్సి ఉంటుందని స్పష్టం చేసారు.

ఎన్నికల సంఘానికి నివేదన..
స్క్రీనింగ్ కమిటీలో ఆమోదించిన అజెండాను కేబినెట్ సమావేశంలో చర్చించేందుకు..ఎన్నికల సంఘం అనుమతి కోరనున్నారు. ఇందు కోసం స్క్రీనింగ్ కమిటీ ఆమోదించిన అంశాలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి నివేదిస్తారు. సీఈవో ద్వివేదీ దీనిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి కేబినెట్ నిర్వహణకు అనుమతి కోరనున్నారు. ఎన్నికల సంఘం ఈ అజెండాకు ఆమోదం తెలిపితే ఈ నెల 14వ తేదీన సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే, కేవలం బ్రీఫింగ్కు మాత్రమే అనుమతి ఉందని..ఎటువంటి విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవద్దని సీఎస్ అధికారులకు స్పష్టం చేసారు. ఎన్నికల సంఘం అధికారికంగా అనుమతి ఇస్తేనే 14న కేబినెట్ సమావేశం జరగనుంది.












Click it and Unblock the Notifications