Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏకాకులయ్యారు: కావూరి ఉద్వేగం, లేటయిందని ప్రధాని

న్యూఢిల్లీ: విభజనపై కేంద్రమంత్రివర్గ సమావేశంలో కావూరి సాంబశివ రావు, పళ్లం రాజులు అరగంటకు పైగా వాదించారు. సమైక్యాంధ్రనే ఉంచాలని, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని వారు సహచరులతో మాట్లాడుతూ కావూరి ఉద్వేగానికి కూడా లోనయ్యారు. అయితే తెలంగాణకు మాటిచ్చామని, ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. రాయలసీమ ప్రత్యేక ఉద్యమం తప్పదని కిశోర్ చంద్రదేవ్ హెచ్చరించారు. భేటీలో జైపాల్ రెడ్డి తెలంగాణ అవసరాన్ని వివరించారు.

సమాచారం మేరకు.. కేబినెట్ సమావేశంలో కావూరు, జైపాల్ రెడ్డి, పళ్లంరాజు, కిశోర్ చంద్రదేవ్ పాల్గొన్నారు. తొలుత కావూరుకు మాట్లాడేందుకు సమయం ఇచ్చారు. ఆయన దాదాపు 35 నిముషాలపాటు గట్టిగా తన వాదన వినిపించారు. "హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్రుల శ్రమ ఉంది. నగరం అభివృద్ధికి దోహదపడ్డాం. దాన్ని కేవలం పదేళ్లపాటే ఉమ్మడి రాజధానిగా చేస్తే సరిపోదు. కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి'' అని కోరారు.

Cabinet note withdraws proposal of Rayala Telangana

గవర్నర్‌కు కేవలం శాంతి భద్రతలు అప్పజెప్పడం సరైంది కాదని, ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిని కాదని ఏం చేయగలరని ప్రశ్నించారు. ఇది కంటితుడుపు చర్యలా ఉందన్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తుందని ఆస్తులు అమ్ముకుపోవాల్సి వస్తుందని, ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కెసిఆర్ తదితరుల హెచ్చరికలను ప్రస్తావించారు.

భద్రాచలం తొలుత ఆంధ్ర రాష్ట్రంలో ఉండేదని, దాన్ని తెలంగాణకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. "అనంతపురం, కర్నూలు జిల్లాలనైనా తెలంగాణలో చేర్చితే వారికైనా రాజధాని ఉందనే తృప్తి ఉండేది. కర్నూలు హైదరాబాద్‌కు సమీపంలో ఉంది. వారేం పాపం చేశారు? కరువు జిల్లా అనంతపురానికి ఎలా న్యాయం జరుగుతుంది? రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఒక దశలో నిర్ణయించారు. కానీ... తెలంగాణలో ఒక్కరోజు బంద్ జరిగేసరికి వెనక్కు తగ్గడం సమంజసమా?'' అని ప్రశ్నించారు.

అయితే "రాయల తెలంగాణ గురించి పరిశీలిస్తున్నట్లు ఎవరు చెప్పారు? మీతో చెప్పామా? దాన్ని పరిశీలనలోకే తీసుకోలేదు'' అని జైరాం పేర్కొన్నారు. ఇక పోలవరం ముంపు ప్రాంతాలు తెలంగాణలో ఉన్నంత మాత్రాన ప్రాజెక్టు ఆగిపోదన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేయకపోవడం వల్ల జరిగే నష్టాలను పళ్లంరాజు ప్రస్తావించారు. హైదరాబాద్‌లాంటి రాజధానిని సీమాంద్రులు సమీప భవిష్యత్తులో నిర్మించుకోలేరని ఆయన అన్నారు. సీమాంధ్రులకు హైదరాబాద్‌లో శాశ్వతంగా విద్యావకాశాలు ఉండేలా చూడాలని వాదించారు.

హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేదని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి కిషోర్ చంద్రదేవ్ వాదించారు. విశాఖలో సౌకర్యాలు ఉన్నాయని, అక్కడ రాజధాని ఏర్పాటు చేయవచ్చునని అన్నారు. లేదా విజయనగరాన్ని రాజధానిగా ప్రకటించాలని కోరారు. భద్రాచలాన్ని సీమాంధ్రకు అప్పజెపాల్సిన అవసరం కూడా లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం అమలు చేయడం మంచిదే కానీ, గ్రామాలు ముంపునకు గురి కాకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికను అమలు చేయాలని ఆయన కోరారు.

కేంద్ర కేబినెట్ సమావేశంలో జైపాల్ రెడ్డి తెలంగాణకు అనుకూలంగా దాదాపు 15 నిమిషాలు మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధిపై కావూరు చేసిన వాదనలను ఖండించారు. సీమాంధ్రులు రాకముందే హైదరాబాద్ అభివృద్ధి చెందిన నగరమని అన్నారు. హైదారాబాద్‌లో సీమాంధ్రులకు భద్రత ఉండదనడం సరికాదని... గత నాలుగు సంవత్సరాల్లో సీమాంధ్రులపై ఒక్క దాడైనా జరిగిందా? అని ప్రశ్నించారు. వీధుల్లో ఎవరో ఏదో అన్నారని, దాని ఆధారంగా హైదరాబాద్‌ను ఎవరికీ దక్కకుండా యూటి చేయాలనడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను వివరించారు.

రాష్ట్ర విభజన బిల్లును కేబినెట్ సమావేశంలో టేబుల్ అజెండాగా ప్రవేశపెట్టడం సరైంది కాదని కేబినెట్ నోట్, జివోఎం నివేదిక, బిల్లును అధ్యయనం చేసేందుకు కనీసం రెండు రోజులైనా సమయం కావాలని కావూరు ప్రతిపాదించారు. ఇందుకు తొలుత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కొంత సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే ఆలస్యమైందని చిదంబరం చెప్పారు. దాంతో ప్రధాని కూడా ఏకీభవించారు. మిగతా మంత్రులు కూడా ప్రధానిని సమర్థించారు.

విభజన బిల్లును కావూరు, పళ్లంరాజు వ్యతిరేకించడంతో ప్రధాని చొరవ తీసుకుని సమావేశానికి హాజరైన మంత్రులందరితో మాట్లాడించారు. అందరూ విభజన బిల్లుకు అనుకూలంగా మాట్లాడడంతో కావూరు, పళ్లంరాజు ఏకాకి అయ్యారు. కావూరు సమావేశం పూర్తికాక మునుపే బయటికి వెళ్లిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+