తెలంగాణ: సోనియాతో షిండే భేటీ, రేపు కేబినెట్ భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశం రేపు(శుక్రవారం) జరుగనుంది. రేపు జరిగే ప్రత్యేక మంత్రి వర్గ సమావేశంలో రాష్ట్ర విభజన బిల్లు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ సమావేశం రేపు సాయంత్రం నాలుగున్నరకు జరుగుతుంది. గురువారంనాడు మంత్రి వర్గ సమావేశం జరిగినప్పటికీ తెలంగాణ బిల్లుపై చర్చ జరగలేదు. నేటి మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ బిల్లు చర్చకు రాదని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ముందుగానే చెప్పారు.
కాగా, యుపిఎ చైర్పర్సన్ సోనియాగాంధీతో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్కుమార్ షిండే, జివోఎం సభ్యుడు జైరాం రమేష్ గురువారం సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లులో చేపట్టాల్సిన సవరణలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్ యూటీతో పాటు పలు ప్రతిపాదనలు జీవోఎం సిద్దం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దాన్ని కొట్టి పారేసినట్లు చెబుతున్నారు. హోంశాఖ సవరణలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, తెలంగాణపై జివోఎం నివేదికను సిద్ధం చేసింది. ఆ నివేదికను సోనియా గాంధీకి అందజేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహంపై వారు సోనియాతో మాట్లాడినట్లు తెలుస్తోంది.
తుది నివేదికను జివోఎం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు కూడా అందజేశారు. కొత్త రాజధానికి నిధులతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో వెనకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించే విషయంపై ప్రధానంగా జివోఎం దృష్టి కేంద్రీకరించింది.
హైదరాబాద్ విద్యాసంస్థల్లో ఉమ్మడి ప్రవేశాల కాలపరిమితి పొడగింపుపై, పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో ఉంచడంపై ఎటువంటి స్పష్టత రాలేదని అంటున్నారు. జనాభా ప్రాతిపదికపై ఆస్తులు, అప్పుల పంపకాన్ని నిర్ణయించే అవకాశం ఉందని అంటున్నారు.