ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ!
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో, టిడిపి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య కేబుల్ నెట్వర్క్ వివాదం స్థానికంగా సంచలనంగా మారింది. ఆళ్లగడ్డలో సుబ్బారెడ్డికి పోటీగా భూమా అఖిలప్రియ కొత్త కేబుల్ నెట్వర్క్ ను ప్రారంభించడంతో ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది.
భూమా అఖిలప్రియ వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి
భూమా అఖిలప్రియ వర్గీయులు, అఖిలప్రియకు సంబంధించిన కొత్త కేబుల్ నెట్వర్క్ అందించే క్రమంలో ఏవీ సుబ్బారెడ్డి కి సంబంధించిన కేబుల్ వైర్లను కట్ చేశారని ఆరోపణలతో ఇరువురి మధ్య వివాదం భగ్గుమంది. దీంతో ఏవీ సుబ్బారెడ్డి భూమా అఖిలప్రియ తీరు పైన తీవ్రస్థాయిలో స్పందించారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తమ కేబుల్ కనెక్షన్లను దుర్మార్గమైన రీతిలో తొలగించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
భూమా అఖిల ప్రియకు సుబ్బారెడ్డి సవాల్
దోపిడీ దొంగల కంటే హీనంగా భూమా అఖిలప్రియ వ్యవహరిస్తున్నారని ఆయన భగ్గుమన్నారు. దమ్ముంటే ప్రజలకు ఉచితంగా కేబుల్ కనెక్షన్లు ఇవ్వాలని ఏవీ సుబ్బారెడ్డి భూమా అఖిలప్రియ కు సవాల్ విసిరారు.తన కేబుల్ కనెక్షన్లు 270 లకే ఇస్తున్నానని, వారికి దమ్ముంటే 200 రూపాయలకే ఇవ్వాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే అంటే రాజు కాదని, అన్నీ తానే రూల్ చేస్తానంటే నడవదని హెచ్చరించారు.

భూమాకు సంచలన బంపర్ ఆఫర్ ఇచ్చిన ఏవీ సుబ్బారెడ్డి
తన మౌనాన్ని అవకాశంగా తీసుకొని రెచ్చగొడుతున్నారని, వివాదం ఇక్కడితో ఆగదని ఆయన హెచ్చరించారు. అఖిలప్రియపై ఆగ్రహంతో ఊగిపోయిన ఏవీ సుబ్బారెడ్డి అఖిలప్రియ కేబుల్ బిజినెస్ దెబ్బ కొట్టడానికి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఒక సంచలన బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఒకటవ తేదీ నుండి కొత్త వాటితో సహా అన్ని కేబుల్ కనెక్షన్లు ఉచితంగా ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆళ్లగడ్డలో కరపత్రాలను కూడా పంపిణీ చేస్తున్నారు.
ఆళ్లగడ్డ ప్రజలకు కేబుల్ నెట్ వర్క్ ఫ్రీ చేసిన సుబ్బారెడ్డి
ఆళ్లగడ్డలో చోటు చేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా ఆళ్లగడ్డ gtpl వినియోగదారులకు తెలియజేసేది ఏమనగా ఏప్రిల్ ఒకటో తారీకు నుంచి డిష్ బిల్లు ఉచితంగా ఇవ్వబడును కావున వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నాము అంటూ పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా ఆదరిస్తున్న కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా అందరూ ఇదే విధంగా సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు.
వాళ్ళను తిరస్కరించాలని స్థానికులకు పిలుపు
నంద్యాల సిటీకేబుల్ పేరుతో ఇతరులు కొత్తవారు ఎవరైనా ఇంటి వద్దకు వచ్చి, పాత సెట్ టాప్ బాక్స్ ల స్థానంలో కొత్త బాక్సులు ఇస్తామంటే తక్షణమే తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే భూమా నాగిరెడ్డి బ్రతికున్న రోజుల్లో ఏవీ సుబ్బారెడ్డి అత్యంత సన్నిహితుడుగా స్నేహితుడిగా ఉండేవారు. నాగిరెడ్డి మరణం తర్వాత భూమా ఫ్యామిలీకి ఏవీ సుబ్బారెడ్డి ఫ్యామిలీకి మధ్య విభేదాలు మొదలయ్యాయి.
మళ్ళీ కేబుల్ వార్ తో ఆళ్లగడ్డలో రగడ
అప్పటినుంచి ఇప్పటివరకు వీరు అనేక సందర్భాలలో గొడవలు పడుతూనే ఉన్నారు. గతంలో భూమా అఖిలప్రియ నన్ను చంపడానికి చూస్తుందని ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఇద్దరు ఒకటే పార్టీలో ఉండి పడుతున్న గొడవల పట్ల టిడిపి అధిష్టానం గతంలోనూ, వీరి మధ్య సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది. అది ఫలించలేదు. ఇక తాజాగా మరో మారు కేబుల్ వార్ తో మళ్లీ ఇద్దరి మధ్య రచ్చ మొదలైంది.












Click it and Unblock the Notifications