సత్యానందం బెయిల్ రద్దుకు అపీల్: కాల్ మనీ కేసుపై సవాంగ్
విజయవాడ: ఓ రైస్ మిల్లర్ యజమాని నుంచి డబ్బు తీసుకుని బెదిరింపులకు పాల్పడిన కేసులో ట్రాన్స్కో డివిజనల్ ఇంజనీరు ఎం సత్యానందంకు కోర్టు ఈ నెల 13 వరకు రిమాండు విధించింది. కాల్మనీ సెక్స్ రాకెట్ కేసులో సత్యానందంకు మంజూరైన బెయిల్ రద్దు కోరుతూ అప్పీలుకు వెళ్లామని నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ తెలిపారు.
కాల్మనీ సెక్స్రాకెట్ కేసులో నాలుగో నిందితునిగా ఉన్న సత్యానందం అజ్ఞాతం వీడి హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలతో నిందితుడు గురువారం విజయవాడ కోర్టులో హాజరై పూచీకత్తు దాఖలు చేసి బయటకు వచ్చారు.

ఆ తర్వాత నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరగా వచ్చిన కొన్ని గంటల్లోనే నాటకీయ పరిణామాల నేపథ్యంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీస్టేషన్కు తరలించారు. మూలపాడుకు చెందిన కోటా సాంబశివరావు అనే రైస్ మిల్లు యాజమాని వద్ద 2007లో ఐదు లక్షలు తీసుకున్న సత్యానందం తిరిగి ఇవ్వకుండా మోసం చేసి బెదిరించాడని అతని ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టు చేసి రాత్రంతా స్టేషన్లోనే ఉంచారు.
స్టేషన్ నుంచి శుక్రవారం సాయంత్రం నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఇన్ఛార్జి కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి ఈనెల 13వరకు రిమాండు అదేశించారు. వెంటనే అతన్ని పోలీసులు నేరుగా జిల్లా జైలుకు తరలించారు. కాల్మనీ సెక్స్రాకెట్ ఆరోపణలపై సత్యానందంపై కేసు నమోదు చేసిన పోలీసులు ముందస్తు బెయిల్ పొందడటంపై కక్ష కట్టి ఎలాగైనా అతన్ని జైలుకు పంపాలనే దురుద్దేశంతో మరో అక్రమ కేసు బనాయించారంటూ అతని న్యాయవాది సిహెచ్ మన్మధరావు అన్నారు.












Click it and Unblock the Notifications