'కాల్ మనీ ఆగడాలతో మహిళలు దుర్భర జీవితం, ఆవేశం ఆపుకోలేకే'
విజయవాడ: కాల్ మనీ వ్యవహారం పైన సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ అరుణ్ అనే న్యాయవాది సోమవారం మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. ఆయన హెచ్చార్సీలో పిటిషన్ దాఖలు చేశారు. కాల్ మనీ గ్యాంగు ఆగడాలతో మహిళలు దుర్భర జీవితం గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హెచ్చార్సీలో ఫిర్యాదు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సిబిఐతో దర్యాఫ్తు జరిపించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్కు ఆదేశాలు జారీ చేయాలని తాను హెచ్చార్సీని కోరినట్లు చెప్పారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు పేదవారు కొందరు స్వార్థపరుల చేతిలో చిక్కుకుపోయారన్నారు.
రోజుకు పది రూపాయలు, అంతకంటే ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇవ్వడం అంటే పేదల రక్తమాంసాలు పీల్చడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం వడ్డీ 36 శాతానికి మించకూడదన్నారు. అలాంటిది వారు పేదలను పీల్చిపిప్పి చేస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా న్యాయవాది కాల్ మనీ గ్యాంగ్ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఓ న్యాయవాదిని అని అలా చేయకూడదని, కానీ బాధితుల ఆవేదన చూసి ఆవేశం ఆపుకోలేకపోతున్నానని చెప్పారు. వడ్డీ డబ్బులు ఇస్తావా లేదా ఆ వ్యక్తి వద్దకు వెళ్తావా అని మహిళల్ని బెదిరించడం ఎంత దారుణమన్నారు.
ఇలాంటి వారికి నిర్భయ శిక్షలు సరిపోవన్నారు. తక్షణమే అమలు పర్చే శిక్షలు కావాలన్నారు. కాల్ మనీ దందాలు వెలుగులోకి తెచ్చిన పోలీసులను ఆయన ప్రశంసించారు. అదే సమయంలో ఇందులో కొందరు పోలీసుల పాత్ర ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని చెప్పారు.
18వ తేదీలోగా నివేదిక ఇవ్వండి
న్యాయవాది ఫిర్యాదుపై స్పందించిన హెచ్చార్సీ వచ్చే నెల 18వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎస్ను ఆదేశించింది. ఈ వ్యవహారంపై ఏపీ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు నోటీసులు జారీ చేసింది. జనవరి 18లోగా నోటీసులకు వివరణ ఇవ్వాలని హెచ్ఆర్సీ ఆదేశాలిచ్చింది.