గమ్మునుండలేని.. గర్జించలేని..పరిస్థితిలో చంద్రబాబు..!!
కేంద్రం విషయంలో అతిగా వెళ్తే సమస్య. ఎదురు తిరిగినా, దూషించినా, కసిరినా, కన్నెర్ర చేసినా సమస్యలు వచ్చే అవకాశముందని టీడిపి విశ్వశిస్తోంది. పోలవరం వంటి కార్యక్రమం కేంద్రంతో ముడి పడి ఉందని టీడిపి ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం కఠిన నిర్నయం తీసుకుంటే ఇబ్బందులొస్తాయని భావిస్తున్నారు టీడిపి నేతలు. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని ఏపి ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. ప్రజల మనోభావాలు, రాష్ట్ర ప్రయోజనాలు, జరిగిన అన్యాయం, ఇకపై ఎలా ముందుకు వెళ్లాలి. ఏం చేస్తే న్యాయం జరుగుతుందన్న అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారాం. ప్రస్తుతమైతే కేంద్రతో మౌనాన్నే ప్రశ్నలుగా సందిస్తున్నారు చంద్రబాబు.
కేంద్రంతో వైరం కన్నా సఖ్యతే మంచిదంటున్న ఏపి సీయం..!!
కేంద్ర బడ్జెట్ లో ఆంద్రప్రదేశ్ కు అన్యాయం జరిగింది. అధికార, విపక్ష పార్టీలన్నీ ఆందోళన వ్యక్తం చేసాయి. ఇంత జరిగినా ఏం చేయలేకపోతున్నారు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తమ పార్టీ నేతలతో పలు భేటీలు ఏర్పాటు చేసినా కేంద్రం పైన కార్యాచరణ మాత్రం సున్నా. కేంద్రం ఏం చేసినా చూస్తూ ఉండడం తప్ప చంద్రబాబు ఏం చేయలేరనే చర్చ సాగుతోంది. పార్టీ నేతలతో అంతర్గతంగా మాట్లాడిన సందర్భంలో బిజెపిపైన, కేంద్రంపైన విమర్శలు గుప్పించారు. వాటిని లీకులు ఇప్పించారు. అక్కడకి తానేదో కేంద్రంతో గట్టిగా పోరాటం చేస్తున్నట్లు ప్రజలలోకి పంపించే ఏర్పాటు చేశారు. కానీ కేంద్రం పై ఒక్క మాట మాట్లాడలేదు. కేంద్రం పట్ల చంద్రబాబు చూపిస్తున్న ముభావ వైఖరి పట్ల పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
లోటు బడ్జెట్ లో ఏపి..! లెవల్ ప్లెయింగ్ ఫీల్డ్ వచ్చేంత వరకూ కష్టపడాలి..!
'మనకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. దీని పై ఎవరంటేవారు మాట్లాడితే లేనిపోని సమస్యలొస్తాయి. మనం ఒక విధానం తీసుకున్నాం. మనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దమని కోరుతున్నాం... మీరు కూడా సంయమనంతో మాట్లాడండి' అని చంద్రబాబు తమ నేతలతో చెప్పడంతో పేలని లక్ష్మీ బాంబ్ లా తయారయ్యింది బాబు వ్యవహారం. కేంద్రం నుంచి ఏపికి ఎలాంటి సహకారం అందకపోవడంతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. అన్నీ పరిశీలిద్దాం. ఏం చేస్తే లాజికల్గా ఉంటుందో చూద్దామని చెప్పారట. కేంద్రానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా, తీసుకోకపోయినా సమస్యే. టీడిపి వ్యతిరేకత తెలియజేయకున్నా ఇబ్బందేనని చెబుతున్నారు చంద్రబాబు.
శరాఘాతంగా మారిని కేసులు..!కొలిక్కి వస్తేనే ప్రగతి పథం...!
ఓటుకు నోటు కేసు అడ్డం పెట్టుకుని కేంద్రం నాటకాలు ఆడుతున్నా ఏం చేయలేని స్థితిలో ఉన్నారు చంద్రబాబు. కేంద్రానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడితే కేసును బయటకు తీస్తారనే భయమే ఇందుకు కారణం. అందుకే చంద్రబాబు మాట్లాడలేకపోతున్నారని చెబుతున్నారు. కొందరు నేతలు రాజీనామా అదీ ఇదీ అంటున్న అవన్నీ మాటలే. నిజంగా రాజీనామాలు చేసి కేంద్రాన్ని ఎదిరించే సాహసం ప్రస్తుతం టీడీపీ చేయలేదనే తెలుస్తోంది. చంద్రబాబు ముందున్న సమస్యను విపక్షం పై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. వైకాపా ఎలాగు ముందే సరెండర్ అయిందని చెప్పాలి. ఏపీకి అన్యాయం జరుగుతున్నా మాట్లాడలేని పరిస్థితిలో పడింది. తమ వ్యక్తిగత ప్రతిష్టల కోసం ఏపీని కేంద్రం వద్ద నేతలు తాకట్టు పెట్టారనే విమర్శలొస్తున్నాయి.
ఎంతకాలం సంయమనం..! ఇంకెంత కాలం సహనం..!!
మంత్రులు తొందరపడి మాట్లాడవద్దని చంద్రబాబు సూచించారు. ఎపికి అన్యాయంపై పోరాటం చేద్దామని ఆయన అంటున్నారు. నిధులు, విభజన హామీలు నెరవేర్చక పోయినా సహనంతో ఉండాలన్నది చంద్రబాబు సిద్దాంతంగా తెలుస్తోంది. అమరావతిని అటు పల్లె కాదు..ఇటుపట్నం కాదు అన్నట్లు చూస్తున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ లేదా విశాఖపట్నంలలో మెట్రో ఇస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. విభజన చేసిన కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయిందని, బిజెపిది ఇదే తీరు అని హెచ్చరించిన చంద్రబాబు ఆ తర్వాత స్వరం మార్చారు. ఏం చేసినా అసలు చర్యలే లేకుండా చేష్టలుడిగినట్లు చూస్తుండటం మరిన్ని విమర్శలకు తావిస్తోంది.