మూడు ప్రాంతాల మధ్య ఘర్షణ పెట్టేందుకే జగన్ మూడు రాజధానుల ప్రకటన: రాజధాని రైతుల ఆగ్రహం
ఏపీ శాసనసభ సమావేశాల చివరి రోజు రాజధాని అంశం పై ఏపీ అసెంబ్లీ లో జరిగిన సుదీర్ఘ చర్చలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు రాజధాని ప్రాంత రైతులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. సీఎం జగన్ శాసనసభ సమావేశాల్లో భాగంగా ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశముందని ప్రకటించడాన్ని రాజధాని ప్రాంత రైతులు తప్పు పడుతున్నారు.33 వేల ఎకరాల భూములను రైతులు రాజధాని కోసం ఇచ్చారని, ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజధాని వికేంద్రీకరణ జరగాలని జగన్ ప్రకటన
అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కారాదని, వికేంద్రీకరణ జరగాలని అందుకే ఏపీకి మూడు రాజధానులు అవసరముందని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జుడిషియల్ క్యాపిటల్ రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని చెప్పిన సీఎం జగన్ విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ,అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయవచ్చునేమోనని సూచనప్రాయంగా తెలియజేశారు.
నాడు రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం ఎందుకు అంగీకరించారని జగన్ కు రైతుల ప్రశ్న
అయితే రాజధాని రైతులు సీఎం జగన్ కి అభివృద్ధి వికేంద్రీకరణ కు సంబంధించి ఆలోచన ఉన్నప్పుడు నాడు టిడిపి హయాంలో అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఎందుకు అంగీకరించారని, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని నిలదీస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు రాజధానిపై రోజుకో రకమైన ప్రకటనలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు.
నిపుణుల కమిటీ నివేదిక రాక ముందే సీఎం జగన్ ప్రకటనపై అనుమానాలు
నిన్నటి వరకు కూడా మంత్రులు రోజుకో రకమైన వ్యాఖ్యలు చేస్తే , సీఎం జగన్ కూడా మూడు రాజధానులు ఉండొచ్చు అని చెప్పటం దేనికి సంకేతం అని వారు ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం సరైనది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. అసలు నిపుణుల కమిటీ నివేదిక రాకముందే జగన్ మూడు రాజధానుల ప్రకటన చేస్తున్నారని మండిపడుతున్నారు. మూడు ప్రాంతాల మధ్య ఘర్షణ పెట్టడానికే సీఎం జగన్ ఈ ప్రకటన చేశారని రాజధాని రైతులు పేర్కొన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని, కోర్టుకు వెళ్తామని రాజధాని రైతులు తేల్చి చెబుతున్నారు.
కోర్టును ఆశ్రయిస్తామన్న రాజధాని రైతులు
33 వేల ఎకరాల భూములు ఇచ్చిన తరువాత, రాజధాని ఏర్పాటుకు కావలసిన భవన నిర్మాణాలు కొన్ని జరిగిన తర్వాత, ఇప్పుడు రాజధాని వికేంద్రీకరణ అంటే అది ఏమాత్రం సమంజసం కాదని రాజధాని రైతులు అంటున్నారు. కోర్టును ఆశ్రయిస్తామని చెప్తున్న రైతులు అందరం కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని, ఈ అంశాన్ని ఇంతటితో వదిలేది లేదని రాజధాని రైతులు తేల్చి చెబుతున్నారు.
మూడు ముక్కలాటగా మారిన రాజధాని రగడ .. ఏమవుతుందో !!
ఏదేమైనప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అటు విశాఖ వాసులకు, ఇటు రాయలసీమ వాసులకు సంతోషాన్ని కలిగిస్తుంటే, రాజధాని అమరావతి రైతులకు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. రాజధాని ఉనికిని ప్రశ్నార్థకం చేసే త్రిశంకు రాజధాని తయారు చేయబోతున్నారు అని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు రాజధాని ప్రాంత రైతులు. చూడాలి జగన్ ప్రకటించిన ఈ మూడు ముక్కలాట ఏపీలో పరిస్థితులను ఎలా మారుస్తుందో .