ఏడో రోజు ఉధృతంగా రాజధాని రైతుల పోరాటం: అర్ధనగ్న ప్రదర్శనలు, ర్యాలీలతో నిరసనల హోరు
Recommended Video
ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానుల ప్రకటనపై వెల్లువెత్తుతున్న నిరసనలు నేటితో ఏడో రోజుకు చేరాయి. రాజధాని రైతుల పోరాటం ఉగ్ర రూపం దాలుస్తుంది. మూడు రాజధానుల ప్రకటనకు నిరసనగా అమరావతిలోని 29 గ్రామాల ప్రజలు పిల్లా జెల్లలతో రోడ్లెక్కారు . అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏడవ రోజు ఆందోళనలు మొదలయ్యాయి. రైతులు, ప్రజలు ఆరు రోజులుగా వివిధ రూపాల్లో తమ నిరసన తెలియజేశారు. ఇక నేడు నల్లదుస్తులు ధరించి తమ నిరసనను తెలుపుతున్నారు రాజధాని ప్రాంత రైతులు .
రాజధాని రైతుల పోరాటానికి ప్రజాసంఘాల, విద్యార్ధి సంఘాల మద్దతు
ఏపీ రాజధానిగా అమరావతిని మార్చొద్దని నిరసన తెలియజేస్తున్న రైతులు, ప్రజలకు ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. ఇక నేడు మరోమారు తుళ్లూరులో రాజధాని రైతులు మహాధర్నాకు సిద్ధమయ్యారు. కృష్ణాయపాలెం, వెలగపూడి, మందడంలో రైతులు రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తున్నారు . మరోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో రాజధాని రైతులు ఈరోజు సమావేశం అయ్యి తమ గోడు వెళ్ళబోసుకోనున్నారు.
ఉపరాష్ట్రపతికి వినతిపత్రం .. గవర్నర్ ను కలవాలని నిర్ణయం
గన్నవరం మండలం ఆతుకూరులో రాజధాని మార్పు అంశంపై వెంకయ్యనాయుడికి రాజధాని రైతుల వినతి పత్రం ఇవ్వనున్నారు.మరోవైపు, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలసి మొరపెట్టుకోవాలని రాజధాని రైతులు గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు . మరోవైపు మంగళగిరి మండలం నిడమర్రులో రైతుల ధర్నా చేపట్టారు. రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు డిమాండ్ చేశారు.
సేవ్ అమరావతి పేరిట విజయవాడలో ర్యాలీ ... ఛలో హైకోర్టు అంటున్న న్యాయవాదులు
నేడు మందడం రహదారిపై ఆందోళన నిర్వహిస్తున్నారు రైతులు .దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని రోడ్డుపైకి రాకుండా అడ్డుకుంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. న్యాయవాదులు ‘చలో హైకోర్టు'కు పిలుపునిచ్చారు. ఇక విజయవాడలో ‘సేవ్ అమరావతి' పేరిట ర్యాలీ నిర్వహించారు. హైకోర్టు విషయంలో కూడా న్యాయవాదులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
మందడంలో అర్ధ నగ్న ప్రదర్శనలు .. ఉద్రిక్తత
ఇక రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ కాకుమాడులో రైతులు ధర్నాకు దిగనున్నారు. ప్రతిపక్ష పార్టీలతోపాటు ప్రజా సంఘాలు, విద్యార్థులు ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక మందడంలోనూ , తుళ్లూరులోనూ టెంట్లు వేసేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మందడంలో రైతుల అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. చొక్కాలు తీసి రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు మందడం రహదారిపై అడ్డంగా టెంట్ వేయడంతో సచివాలయానికి రాకపోకలు నిలిచిపోయాయి.