రాజధాని రగడ ..సీఆర్డీఏ కొత్త ప్లాన్ ముచ్చటేది ? సీఎం జగన్ మనసులో ఏముంది ?
ఏపీ రాజధాని అమరావతి తరలింపుపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారని అందులో భాగంగానే సింగపూర్ కన్సార్టియం ఇచ్చిన ప్లాన్ లో మార్పులు చేర్పులు చేశారని ప్రచారం జరిగింది. అంతలోనే మరోమారు ఏపీ రాజధాని అంశం బొత్సా చేసిన వ్యాఖ్యలతో పరిస్థితి డోలాయమానంగా తయారైంది.

మరోమారు దుమారం రేపిన బొత్సా వ్యాఖ్యలు
ఏపీ రాజధాని నిర్మాణానికి కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించి సీఆర్డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది అని రాజధాని నిర్మాణం అమరావతిలోనే జరుగుతుంది అని అంతా భావించారు. కానీ తాజాగా బొత్సా చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజధాని నిర్మాణంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తాజాగా జరిగిన క్యాబినెట్ భేటీలో రాజధాని నిర్మాణ అంశం చర్చకు వచ్చిన నేపధ్యంలో మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యలు అందర్నీ కన్ఫ్యూజ్ చేశాయి .

పక్కకి పోయిన సింగపూర్ మాస్టర్ ప్లాన్ మార్పు అంశం
సింగపూర్ మాస్టర్ ప్లాన్ మార్చి రాజధాని అమరావతిలో అక్కడే నిర్మాణాలు జరుగుతాయని భావిస్తే బొత్సా వ్యాఖ్యలతో మరోమారు రాజధాని అమరావతిపై నీలి నీడలు కమ్ముకున్నాయి. రాజధాని నిర్మాణంపై అభిప్రాయాలు సేకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిపుణుల కమిటీ పర్యటిస్తుందని రాజధాని ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి అన్న అంశాలపై నిపుణుల కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంది అని తెలిపారు మున్సిపల్ శాఖామంత్రి బొత్సా సత్యన్నారాయణ .

బొత్సా వ్యాఖ్యలతో రాజధానిపై అయోమయం
రాజధాని నిర్మాణం ఎక్కడ జరపాలో కమిటీ నిర్ణయిస్తుందని అన్నారు. నిపుణుల సూచన, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్మాణంపై నిర్ణయాలు తీసుకుంటామని బొత్సా వ్యాఖ్యలు చెయ్యటం ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. నిపుణుల కమిటీ సూచనల మేరకు క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాతే రాజధాని అంశం మాట్లాడతామని ఆయన స్పష్టం చేశారు.
ఇక రాజధాని అమరావతి నిర్మాణాలకు సంబంధించి అవసరం అయిన వాటిని మాత్రమే నిర్మిస్తామని చెప్పారు.

రాజధాని అమరావతికి ప్రాధాన్యత లేనట్టుగా కామెంట్స్
ఆయన వ్యాఖ్యలలో రాజధాని అమరావతికి పెద్ద ప్రాధాన్యం ఇచ్చినట్టుగా లేదు . ఇక అంతే కాదు ప్రస్తుతం తాత్కాలిక సెక్రటేరియట్ ప్రాంతంలో వర్షం పడితే ముంపునకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు . ఇక్కడ ఒక భవనం నిర్మించాలంటే పునాదులు 100 అడుగుల లోతులో తవ్వాల్సి వస్తుందని, దీనికి ఖర్చు కూడా చాలా అవుతుందని బొత్సా చేసిన వ్యాఖ్యలు రాజధాని విషయంలో మరింత అనుమానం రేకెత్తిస్తోంది.

సీఆర్డీఏ కొత్త ప్లాన్ ఏమైందో ? .. సీఎం మనసులో ఏముందో ?
ఇప్పటికే సింగపూర్ కన్సార్టియం ఇచ్చిన మాస్టర్ ప్లాన్ కొత్త ప్రణాళికలో భాగంగా 25 అంతస్తుల నిర్మాణాలకు బదులు 10 అంతస్తుల నిర్మాణాలు చేపట్టాలని , భారీ బడ్జెట్ తో సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న నిధులను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేస్తారని ప్రజలు భావించిన లోపే మరోమారు బొత్సా వ్యాఖ్యలు అసలు సీఎం జగన్ మనసులో ఏముందో అన్న అనుమానాన్ని కలిగిస్తున్నాయి. సీఆర్డీఏ కొత్త ప్లాన్ ను ఆమోదించి సచివాలయం పాత ప్లాన్ లోని ఐదు టవర్లకు బదులు రెండు టవర్లు నిర్మాణం చెయ్యటానికి , 25 అంతస్తులకు బదులు 10 అంతస్తులు కట్టటానికి నిర్ణయం తీసుకుంటారని భావిస్తే అదేమీ లేకుండా బొత్సా చేసిన ప్రకటన మరోసారి డైలమా లో పడేసింది.












Click it and Unblock the Notifications