జగన్ కు మంచి,చెడు తేడా తెలీదన్న జ్యోతుల .. రాజధాని రైతులు పెయిడ్ ఆర్టిస్ట్ లా అన్న కేశినేని
ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్ చేసిన ప్రకటన రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొత్త సంవత్సరం వేళ కూడా రాజధాని అమరావతిలో ఆందోళనలు ఆగటం లేదు. వై సీపీ సర్కార్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు రాజధాని రైతులు. ఒకపక్క టీడీపీ, జనసేన పార్టీ అధినేతలు నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని రైతుల దీక్షకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. రాజధాని లేని రాష్ట్రం కోసం రైతులు ఎంతో త్యాగం చేశారన్న టీడీపీ నేతలు సీఎం జగన్ తీరుపై, వైసీపీ సర్కార్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మూడు రాజధానులు కావాలని జగన్ ను ఎవరు అడిగారన్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన సంచలన ప్రకటనపై ఇప్పటికే అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టిన నేపధ్యంలో అసలు మూడు రాజధానులు కావాలని జగన్ ను ఎవరు అడిగారని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ . రైతులకు మద్దతుగా మాజీ మంత్రి దేవినేని ఉమ చేపట్టిన రిలే నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపిన జ్యోతుల నెహ్రూ జగన్ కావాలనే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే మూడు రాజధానుల ప్రకటన చేశారని ఆరోపించారు.

విశాఖ రాజధాని అయితే ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారని హెచ్చరిక
అమరావతి అనే పేరుతో చంద్రబాబు బ్రాండ్ పడుతుంది అని భావిస్తే వైఎస్సార్ లేదా గాంధీ పేరు పెట్టుకోవాలని సూచించిన జ్యోతుల విశాఖను రాజధానిగా మార్చితే ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారని హెచ్చరించారు. తాను జగన్కు అత్యంత సన్నిహితంగా ఉన్నానని చెప్పిన జ్యోతుల ప్రజల అభిప్రాయం జగన్ కు అసలు పట్టదని చెప్పారు. ఏదైనా అనుకుంటే మంచి చెడు అన్న తారతమ్యం లేకుండా చేసే స్వభావం జగన్ ది అని ఆయన పేర్కొన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

రైతుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించకపోవటం శోచనీయం అన్న ఎంపీ కేశినేని నానీ
ఏపీకి మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు అనాలోచిత వ్యాఖ్యలని మండిపడుతున్న టీడీపీ ఎంపీ కేశినేని నానీ రాజధాని రైతుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించకపోవటం శోచనీయం అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను మంత్రులు హేళన చేస్తున్నారని ఎంపీ కేశినేని నాని ఫైర్ అయ్యారు . రైతుల దీక్షకు మద్దతు తెలిపిన ఎంపీ నానీ మాట్లాడుతూరాజదాని రైతులు త్యాగమూర్తులు అన్నారు.

రైతులు పెయిడ్ ఆర్టిస్ట్ లు అయ్యారా ? అని కేశినేని నానీ ప్రశ్న
అలాంటివారు ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్లు అయ్యారా? అని మండిపడ్డారు. అమరావతి నుంచి రాజధానిని తరలించడం ఎవరి తరమూ కాదని స్పష్టం చేశారు కేశినేని నానీ . రాజధాని తరలింపుపై న్యాయ పోరాటం చేస్తామని కేశినేని నాని తెలిపారు. నూతన సంవత్సరం రోజు రైతులను ఏడిపించడానికి జగన్ ముఠాకు సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు .పరిపాలన చేత కాకపోతే ఒక్క ఛాన్స్ అని ఎందుకు అడిగావని జగన్ ను నిలదీశారు . విశాఖ ప్రజలు అమాయకులని..వారిని దోచుకుందామని చేస్తున్న కుట్ర విశాఖలో రాజధాని ఏర్పాటు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు . రాజధాని అమరావతిలోనే కొనసాగాలని ఎంపీ కేశినేని నానీ డిమాండ్ చేశారు .












Click it and Unblock the Notifications