క్యాపిటల్ వార్ ... ఒకవైపు అమరావతి కోసం ఆందోళన .. మరోవైపు మూడు రాజధానులపై వైసీపీ సంతకాల సేకరణ
ఏపీలో రాజధాని రగడ నేటికీ రసవత్తరంగా సాగుతుంది . రాజధాని అమరావతి కోసం ఒకపక్క అమరావతి రైతులు పోరాటం సాగిస్తుంటే, మరోపక్క మూడు రాజధానుల కోసం వైసీపీ కూడా ర్యాలీలు చేస్తుంది. ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ నుండే పాలన సాగించాలని మొండిగా వ్యవహరిస్తున్న క్రమంలో ఆందోళనలు ఉధృత రూపం దాలుస్తున్నాయి .రాజధాని రైతులు తమ పోరాటాన్ని ఆపకుండా కొనసాగిస్తున్నారు. పోటాపోటీగా మూడు రాజధానుల ఉద్యమం కూడా కొనసాగుతుంది.
క్యాపిటల్ వార్..నేడే మహా ప్రదర్శన..43వ రోజు రాజధానిలో కొనసాగుతున్న ఆందోళనలు
పోటాపోటీగా అమరావతి ఉద్యమం .. వైసీపీ నేతల మూడు రాజధానుల ఉద్యమం
అమరావతికి మద్దతుగా ఓ వైపు టీడీపీ, రైతు జేఏసీ ఆందోళనలు, నిరసనలు చేస్తుండగా, మరోవైపు వైసీపీ సైతం పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతుగా అమరావతి వద్దు..మూడు రాజధానులు ముద్దు అనే నినాదంతో ర్యాలీలు, సంతకాల సేకరణ నిర్వహిస్తుంది . రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ర్యాలీలలో పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, వివిధ విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వివిధ వర్గాల ప్రజలు మూడు రాజధానులకు మద్దతుగా సంతకాలు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ చేస్తున్న వైసీపీ
అటు ఉత్తరాంధ్ర లోనూ, ఇటు రాయలసీమలోనూ వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణకు ప్రజల నుండి మద్దతు లభిస్తుంది. విజయనగరం పట్టణంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నానికి మద్దతుగా విశాఖలో సంతకాల సేకరణ జరిగింది. అటు తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి,కడప, అనంతపురం, గుంటూరు జిల్లాల్లోనూ రాజధానిపై ప్రభుత్వానికి మద్దతుగా సంతకాలు సేకరించారు. రాయలసీమలోనూ సంతకాల సేకరణ నిర్వహించి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ర్యాలీలతో, సంతకాల సేకరణతో ప్రజల మద్దతు కూడగడుతున్న వైసీపీ
వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు భారీగా ర్యాలీలు చేశారు. మోటార్ సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీల్లో ప్రజలు, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొని పాలనా వికేంద్రీకరణకు మద్దతు తెలిపారు. మూడు రాజధానులే ముద్దు అంటూ నినాదాలు చేశారు.మూడు రాజధానులు ముద్దు, అమ్మ ఒడికి స్వాగతం, మాకు ఇంగ్లిష్ మీడియం కావాలి అనే నినాదాలతో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ నిరనయాలకు మద్దతు కూడగడుతున్నారు వైసీపీ శ్రేణులు .