వైసిపి నేత,మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్పై కేసు నమోదు...ధర్నా లో ఆత్మహత్యాయత్నమే కారణం
శ్రీకాకుళం:వైసిపి నేత, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల రెండు రోజుల క్రితం ఆయన తిత్లీ తుపాన్ బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు.
ఈ నేరానికి పాల్పడినందుకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పిరియా సాయిరాజ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సోంపేట ఎస్సై సిహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. సాయిరాజ్పై 309, 341, 353 సెక్షన్ల కింద నాన్బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. సాయిరాజ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గ వైసిపి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట ఎమ్మార్వో కార్యాలయం వద్ద మంగళవారం తుఫాను బాధితుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అధికారులు తమను అదుకోవడం లేదని, కనీసం తాగునీరు, ఆహారం, పునరావాసం కూడా కల్పించడం లేదని ఆరోపిస్తూ తుఫాను బాధితులు సోంపేట ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
వీరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడంతో పాటు ఇచ్ఛాపురం నియోజకవర్గం వైసిపి ఇన్ ఛార్జ్ పిరియా సాయిరాజ్ ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఆందోళన క్రమంలో అధికారుల వైఖరికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిరియా సాయిరాజ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తుఫాను బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో వైసిపి నేత పిరియా సాయిరాజ్పై కేసు నమోదు చర్చనీయాంశం అయింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన నేతపై కేసులు పెట్టడం దారుణమని వైసిపి నేతలతో పాటు తుపాన్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిరియా సాయిరాజ్పై కేసు ఉపసంహరించుకోవాలని వారు కోరుతున్నారు. పిరియా సాయిరాజ్ ఉద్దానం ఫౌండేషన్ ద్వారా కిడ్నీ రోగులకు సేవలందించటం, అనాధ పిలల్లను దత్తత తీసుకోవటం, పల్లెలకు వైద్య సేవలు, ఉచిత అంబులెన్స్ సౌకర్యం, డ్రోన్ ద్వారా ఉచిత మందులు పంపిణీ చేయటం వంటివి చేయడం ద్వారా స్థానికంగా గుర్తింపు పొందారు.