చంద్రబాబుపై కేసు: ఎల్జీ పాలిమర్స్ బాధితుల పరామర్శ పేరుతో ఏపీకి రాక..మహానాడు..లాక్డౌన్
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృష్ణా జిల్లా న్యాయవాది ఒకరు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే సమయంలో చంద్రబాబు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ శ్రీనివాస్ అనే అడ్వొకేట్ కృష్ణాజిల్లా నందిగామ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ చట్టం సెక్షన్ 188 కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
విశాఖపట్నం జిల్లాలో ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించాలనే కారణంతో చంద్రబాబు పోలీసుల వద్ద అనుమతి తీసుకున్నారని, తీరా అక్కడికి వెళ్లకముందే ఆయన మళ్లీ హైదరాబాద్కు చేరుకున్నారనే విషయాన్ని కూడా శ్రీనివాస్ తన ఫిర్యాదులో పొందుపరిచారని అంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తన కుమారుడు, మాజీమంత్రి నారా లోకేష్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి రాజధాని అమరావతి ప్రాంతంలోని ఉండవల్లిలో గల నివాసాన్ని ఖాళీ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్లో సొంత ఇంట్లో నివసిస్తున్నారు. ఈ నెల 25వ తేదీన ఆయన ఏపీకి రావడానికి రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్కు అనుమతి కోరారు. తాను విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బారిన పడిన బాధిత కుటుంబాలను పరామర్శించాల్సి ఉందని పేర్కొన్నారు. విశాఖ పర్యటన అనంతరం తాను రోడ్డుమార్గంలో అమరావతికి చేరుకుంటానని వివరించారు.
దీనికి భిన్నంగా చంద్రబాబు ఏపీకి వచ్చారు. విమానాలు తిరగట్లేదనే కారణంతో ఆయన విశాఖపట్నానికి వెళ్లలేకపోయారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో నేరుగా అమరావతికి చేరుకున్నారు. మార్గమధ్యలో జగ్గయ్యపేట, కంచికచర్ల వంటి ప్రాంతాల్లో రోడ్ షో తరహాలో పర్యటన చేపట్టారు. లాక్డౌన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. రోడ్ షో తరహాలో పార్టీ కార్యకర్తలను పలకరించారని, పెద్ద ఎత్తున జనం గుమికూడటానికి కారణం అయ్యారని లాయర్ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Recommended Video
ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించాలనే కారణాన్ని చూపిన చంద్రబాబు దీనికి భిన్నంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ రెండూ లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తాయని పోలీసులకు లిఖిపూరకంగా అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు నందిగామ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లోని సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.