కేసీఆర్ను వదిలేది లేదు, హైద్రాబాద్లో కేసు: రావెల
హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యవహారంలో తాము తెరాస ప్రభుత్వం పైన కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని ఏపీ మంత్రి రావెల కిశోర్ మంగళవారం చెప్పారు. చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాము హైదరాబాదులోను కేసులు పెడుతున్నామని చెప్పారు.
రాజీనామా చేయమని చంద్రబాబును అడిగే నైతిక హక్కు తెరాసకు లేదన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తెరాస కొన్నదన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రాజకీయాలు మానుకోవాలన్నారు. ప్రతి విషయాన్ని తెరాస వివాదాస్పదంగా మారుస్తోందన్నారు.
ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను వదిలే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబు ఏ తప్పు చేశారని రాజీనామా చేయాలని, అసలు జగన్ రాజీనామా చేయాలన్నారు.ఏపీ ప్రభుత్వంతో అభివృద్ధిలో పోటీ పడలేక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని మరో మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని కేసీఆర్ ఏమీ చేయలేరని చెప్పారు.
బాబు పక్కదారి పట్టిస్తున్నారు: కడియం
తాను నీతివంతుడనని చెప్పుకుంటున్న చంద్రబాబు లై డిటెక్టివ్ పరీక్షలకు సిద్ధమా అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఏపీ సీఎం అధికారిక ఫోన్లు ట్యాప్ చేస్తే అది తప్పు అవుతుంద్నారు. చంద్రబాబు నిజ స్వరూపాన్ని ఏపీ ప్రజలు గుర్తించాలన్నారు.
ఇప్పటి వరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి విషయాన్ని ఖండించలేదని చెప్పారు. జైలుకు వెళ్లవలసి వస్తుందని చంద్రబాబు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.