నా మీద కేసులు కొత్తేమీ కాదు.. చంద్రబాబు కుట్ర ప్రజలకు తెలుసు : వైఎస్ జగన్
తన మీద కేసులు కొత్తేమీ కాదని, అవన్నీ రాజకీయ ప్రేరేపితమేనని, పదేళ్ల క్రితమే దీనిమీద విచారణ జరిగిపోయిందని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
న్యూఢిల్లీ: తన మీద కేసులు కొత్తేమీ కాదని, అవన్నీ రాజకీయ ప్రేరేపితమేనని, పదేళ్ల క్రితమే దీనిమీద విచారణ జరిగిపోయిందని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఢిల్లీలో వివిధ జాతీయ పార్టీల నాయకులను కలుస్తున్న ఆయన... అందులో భాగంగానే సీపీఐ అగ్రనేతలు సురవరం సుధాకర్ రెడ్డి, డి. రాజా తదితరులను కలిశారు.
వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికైన 21 మందిని టీడీపీలో చేర్చుకోవడమే కాక, వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చిన వైనాన్ని వారికి జగన్ వివరించారు. అనంతరం సురవరం, రాజాలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసుల గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానం ఇచ్చారు.
తనపై పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమేనని, కాంగ్రెస్.. టీడీపీ నేతలు ఏకమై ఈ కేసులు పెట్టారని, తన తండ్రి బతికున్నంత కాలం తన మీద ఏ కేసులు లేవని, అలాగే తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కేసులు లేవని, దానిలోంచి బయటికొచ్చిన తరువాతే తనపై కేసులు పెట్టారని ఆయన పేర్కొన్నారు.
అప్పుడు అధికారంలో ఉన్న సోనియాగాంధీతో కలిసి చంద్రబాబునాయుడే తన పార్టీ నాయకుల ద్వారా తనపై ఈ కేసులు పెట్టించారన్నారు. నిజానికి ఒక వ్యక్తి తప్పు చేసినట్లు ఇంకా రుజువు కాకపోతే.. మూడు నెలల కంటే ఎక్కువ కాలం జైల్లో పెట్టే అధికారం లేదని, అయినా తనను 16 నెలల పాటు జైల్లో పెట్టారని తెలిపారు.
జగన్ కనపడకపోతే పార్టీ ఉండదని భావించి చంద్రబాబు, తనను రాజకీయంగా అణగదొక్కేందుకే కాంగ్రెస్ కలిసి ఈ కుట్ర పన్నారని వ్యాఖ్యానించారు. కేసులతో ఇప్పుడు వీళ్లు కొత్తగా చేయగలిగిందేమీ లేదని, పైన దేవుడున్నాడు, ప్రజలున్నారు.. అందరికీ అన్నీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.