నోటుకు ఓటు కేసులో నోటీస్ ఖాయం: చంద్రబాబు ఏం చేస్తారు?
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ ఎసిబి నోటీసు జారీ ఖాయడమనే వార్తలు వస్తున్నాయి. గురువారం రాత్రి గానీ శుక్రవారంనాడు గానీ ఆయనకు నోటీసులు జారీ కావచ్చునని అంటున్నారు. అయితే, సాక్షిగానే ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉందని అంటున్నారు.
నోటీసు ఇచ్చిన తర్వాత విచారణకు హాజరు కావడానికి 72 గంటల సమయం ఇస్తారు. అయితే, చంద్రబాబు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో ఆయన వివిధ కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉండే అవకాశం ఉంది. దీంతో ఆయనకు వారం రోజుల గడువు ఇవ్వవచ్చునని అంటున్నారు.
నోటుకు ఓటు కేసును రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా సృష్టించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అంటున్నారు. అందులో భాగంగానే సెక్షన్ 8 అమలును ముందుకు తెస్తున్నారని ప్రతిపక్షాలతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వాదిస్తోంది. ఇప్పటికే హైదరాబాదులో సెక్షన్ 8 అమలవుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన వైఖరిని మార్చుకుని వ్యాఖ్యానించింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదనను పక్కన పెడితే, చంద్రబాబు స్టీఫెన్సన్తో మాట్లాడిన టేపులు అతికించినవి గానీ, ట్యాపింగ్కు చెందినవి గానీ కాదని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ తేల్చడంతో కేసుకు బలం చేకూరుంది. అయితే, చంద్రబాబుకు నోటుకు ఓటు కేసులో తెలంగాణ ఎసిబి నోటీసు ఇవ్వగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు నోటీసులు జారీ చేస్తారా అనేది తేలాల్సి ఉంది.
చంద్రబాబుకు నోటీసులు ఇస్తే తాము కూడా నోటీసులు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రులు పలుమార్లు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా ముందుకు కదులుతోంది. కాగా, సెక్షన్ 8పై కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని చంద్రబాబు ఆశిస్తున్నట్లుగా అర్థమవుతోంది. గవర్నర్ నరసింహన్ ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో కేంద్ర జోక్యంపై ఆయన కాస్తా ఆశ పెట్టుకుని ఉండవచ్చు.
కాగా, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాత్రమే కాకుండా కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ కూడా తాము జోక్యం చేసుకోబోమనే పద్ధతిలో మాట్లాడారు. సెక్షన్ 8ను, ఓటుకు నోటు కేసును కేంద్ర ప్రభుత్వం విడివిడిగా చూస్తుందా, కలిపి చూస్తుందా అనేది కూడా తేలాల్సి ఉంది.