నోటుకు ఓటు: సెక్షన్ 8 చంద్రబాబును రక్షిస్తుందా?
హైదరాబాద్: నోటుకు ఓటు కేసుతో చిక్కుల్లో పడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పునర్విభజన బిల్లులోని సెక్షన్ 8ని ఆయుధంగా వాడాలని నిర్ణయించుకున్నారు. సెక్షన్ 8ని కచ్చితంగా అమలు చేయాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్కు చెప్పాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నాయుడు రేపు బుధవారం ప్రధానిని, కేంద్ర హోం మంత్రిని కలిసే అవకాశం ఉంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి సెక్షన్ 8 ప్రకారం తెలంగాణ ప్రభుత్వానికి ఎంత హక్కు ఉంటుందో, తమకూ అంతే హక్కు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. సోమవారం మహా సంకల్ప సభలో కూడా చంద్రబాబు అదే విషయం చెప్పారు.
అయితే, సెక్షన్ 8 చంద్రబాబును రక్షిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే శాంతిభద్రతల సమస్యలను పరిష్కరించడానికి 2014 ఎపి పునర్విభజన బిల్లులో సెక్షన్ 8ని చేర్చారు. లంచం అనేది నేరం. హైదరాబాదులో ఓ ఆంధ్ర వ్యక్తికి భద్రత కొరవడిన అంశంగా దాన్ని చెప్పలేమని న్యాయనిపుణులు అంటున్నారు. ఆంధ్ర వ్యక్తి అయినంత మాత్రాన దొంగతనమో, హత్యనో, అత్యాచారమో, దోపిడీయో చేసి సెక్షన్ 8 కింద తప్పించుకోవడానికి వీలుంటుందనే వాదన అర్థం లేదని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ వాదన చూస్తే అలాగే ఉంది. కానీ, ఆ విధమైన వాదనను చంద్రబాబు గానీ, ఇతర మంత్రులు గానీ చేస్తున్నట్లు కనిపించడం లేదు.

నోటుకు ఓటు వ్యవహారంలో చంద్రబాబు ప్రైవసీకి విఘాతం కల్పించారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఒక వ్యక్తి నేరం చేస్తున్నాడని అనుమానించినప్పుడు ప్రైవేసీకి విఘాతం కలిగించడమనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ప్రైవసీ అంటే రహస్యంగా నేరాలు చేయడానికి అవకాశం కల్పించేది కాదు. నేరపరమైన అనుమానం ప్రైవసీకి మినహాయింపును ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ప్రభుత్వాలనే కూల్చాయని యనమల రామకృష్ణుడు వాదించారు. తాము ఎక్కడా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడలేదని ఎసిబి అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించామని, అందులో భాగంగానే ఆడియో, వీడియో సంభాషణలు బయటపడ్డాయని వారు చెబుతున్నారు. అందువల్ల అది ట్యాపింగ్ కిందికి వచ్చే ప్రశ్నే లేదనే వాదన వినిపిస్తోంది. ఈ రెండు అంశాల ఆధారంగా చంద్రబాబు కేసు నుంచి బయటపడుతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, చంద్రబాబు విషయంలో స్టీఫెన్ సన్తో మాట్లాడిన ఆడియో టేప్ తప్ప మరో ఆధారం ఇప్పటి వరకు లభించలేదు.












Click it and Unblock the Notifications