రేవంత్ రెడ్డికి వెన్ను నొప్పి: ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఎసిబి
హైదరాబాద్: నోటుకు ఓటుకు కేసులో పట్టుబడి తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిని ఎసిబి అధికారులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్లు తెలుస్తోంది. సోమవారం ఆయనకు 80 నుంచి 90 ప్రశ్నలు సంధించినట్లు చెబుతున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన ఎక్కడున్నారనే విషయాలను కనుక్కోవడానికి కూడా ప్రయత్నించారు. మిగతా ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయసింహలను కూడా వారు ప్రశ్నలతో ముంచెత్తారు.
రేవంత్రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్సింహలు కాస్త అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం ఉదయం ఎసిబి అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బిపి, షుగర్ లెవెల్స్, జ్వరంపై వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నిందితులు ముగ్గుర్ని ప్రత్యేక బందోబస్తు మధ్య బంజారాహిల్స్లోని ఎసిబి కార్యాలయానికి తరలించారు. కాగా, కస్టడి మంగళవారంతో ముగియనుండడంతో ఎసిబి అధికారులు సోమవారం నిందితులపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిందితుల్ని విడివిడిగా విచారించారు. ఒక్క రేవంత్రెడ్డినే 80 నుంచి 90 ప్రశ్నలు అడిగినట్లు ఆయన తరపు న్యాయవాది సుధీర్ తెలిపారు. మూడో రోజు కస్టడిలో భాగంగా నిందితుల నుంచి అధికారులు కొంత కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.ఓటుకు నోటు వ్యవహారంలో వెనుక ఎవరెవరున్నారు? అన్న కోణంలోనే ఎక్కువగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
విచారణ అనంతరం రేవంత్రెడ్డి తరపు న్యాయవాది సుధీర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డి ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడిందన్నారు. కొద్దిపాటి వెన్నునొప్పితో రేవంత్ బాధపడుతున్నారని చెప్పారు. రోజూ ఉదయం, సాయంత్రం రేవంత్రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు. అలాగే సిట్ కార్యాలయంలో అన్ని సౌకర్యాలు కల్పించాలలని కోర్టు ఆదేశించిందని తెలిపారు.
కాగా, సోమవారం ఒక్కరోజే రేవంత్పై 80 నుంచి 90 ప్రశ్నలు వేశారన్నారు. అందులో ఆడియో, వీడియో టేపులకు సంబంధించిన ప్రశ్నలులేవని చెప్పారు. ఓటుకు నోటు కేసులో బయటకు వచ్చిన ఆడియో, వీడియోలను రేవంత్రెడ్డి ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు. మంగళావరంతో ఎసిబి కస్టడి ముగియడంతో మంగళవారం సాయంత్రం 4 గంటలకు నిందితులను కోర్టులో హాజరుపరుస్తారని చెప్పారు.

మే 31న స్టీఫెన్సన్ ఇంటి వద్ద ఏసీబీకి పట్టుబడ్డ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అంతకు నాలుగు రోజుల ముందు ఎక్కడెక్కడ తిరిగారు ? ఎవరెవర్ని కలిశారు? అనేదానిపై ఏసీబీ అధికారులు విచారణలో తెలుసుకున్నారు. ఆ నాలుగు రోజులు వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటలేకుండా ఒంటరిగా బయటకు వెళ్లినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఆ విషయమై రేవంత్ను ఆరా తీశారు. ఆ నాలుగు రోజులు, అరెస్ట్ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత కొంత సమయం తన సెల్ఫోన్ ఉపయోగించిన రేవంత్కి ఎవరెవరు ఫోన్ చేశారనే దానిపైనా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు.
సోమవారం ఉదయం సిట్ కార్యాలయం నుంచి బయటకు వచ్చే సమయంలో రేవంత్ రెడ్డి మెడలో పసుపుపచ్చ టర్కీ టవల్తో వచ్చారు. ఆస్పత్రి, అక్కడి నుంచి ఏసీబీ కార్యాలయానికి ఆలాగే వచ్చారు.












Click it and Unblock the Notifications